‘పది’లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
యాజలి(కర్లపాలెం): పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి డి.శ్రీనివాస్ చెప్పారు. బాపట్ల డివిజన్ పరిధిలో పదవతరగతి చదువుతూ చదువుల్లో వెనుకబడిన బాలికల కోసం యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని డీఈఓ శ్రీనివాస్ సోమవారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహిస్తుందని చెప్పారు. బాలికలందరూ పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించటమే లక్ష్యంగా ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ తరగతులను నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. పదవ తరగతిలో మంచి మార్కులతో పాసయ్యే విధంగా ప్రత్యేకమైన సిలబస్ను రూపొందించి బోధించటం జరుగుతుందని తెలిపారు. ఎంఈఓ విజయశ్రీ మాట్లాడుతూ బాపట్ల డివిజన్ పరిధిలోని 12 మండలాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ చదువులో వెనుకబడిన బాలికలు చక్కగా చదివి పాసయ్యే విధంగా యాజలి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం బి.సుగుణమణి, డెప్యూటీ డీఈఓ శివబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి డి. శ్రీనివాస్


