బారామతి విమానాశ్రయం వద్ద ఘటన
రన్వే దగ్గర్లోనే కుప్పకూలిన విమానం
మంటలు చెలరేగి పేలిపోయిన వైనం
అజిత్తో పాటు మరో నలుగురి మృతి
మృతుల్లో పైలట్లు, భద్రతాధికారి, అటెండెంట్
శోకసంద్రంలో మహారాష్ట్ర
నేడు బారామతిలో అంత్యక్రియలు
ప్రధాని, పలువురు నేతల సంతాపం
విచారణకు విపక్ష నేతల డిమాండ్
బారామతి/ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లా లోని పవార్ స్వస్థలమైన బారామతిలో బుధవారం ఉదయం విమానాశ్రయంలో దిగేందుకు కొద్ది క్షణాల ముందు రన్వేకు కేవలం 100 అడుగుల దూరంలో ఈ దారుణం జరిగింది.
రన్వే కన్పించకపోవడంతో మరో రౌండ్ చుట్టి తిరిగి వచ్చే క్రమంలో విమానం అదుపు తప్పింది. క్షణాల వ్యవధిలోనే శరవేగంగా కింద పడిపోయింది. నేలను ఢీకొట్టగానే మంటలు చెలరేగి పేలిపోయింది. ప్రమాద తీవ్రత ధాటికి రెండు ముక్కలైంది. దాంతో పవార్తో పాటు విమానంలోని మరో నలుగురు కూడా అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో పైలట్ కెపె్టన్ సుమిత్ కపూర్, కో పైలట్ కెపె్టన్ శాంభవీ పాఠక్, పవార్ వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ ఉన్నారు.
ప్రమాదం జరిగిన కాసేపటికే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అప్పటికే అజిత్తో పాటు అందరూ ప్రాణాలు కోల్పోయారు. అజిత్ను ఆయన కళ్లద్దాలు, చేతి వాచీ సాయంతో గుర్తించారు. ఆయనతో పాటు మిగతా నలుగురి మృతదేహాలను బారామతి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలియగానే అజిత్ కుటుంబీకులతో పాటు ఆయన పార్టీ ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. వారి శోకంతో ఆ పరిసరాల్లో విషాదం నెలకొంది.
మహారాష్ట్ర అంతటా విషాద ఛాయలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని పలువురు నేతలు తదితరులు ది్రగ్భాంతి వెలిబుచ్చారు. పారీ్టలకు అతీతంగా సంతాపం తెలిపారు. మహారాష్ట్ర ఒక గొప్ప నేతను కోల్పోయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. అజిత్ అంత్యక్రియలు ఆయన రాజకీయ కర్మభూమి అయిన బారామతిలో గురువారం ఉదయం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. మోదీ, అమిత్ షా తదితరులు పాల్గొనే అవకాశముంది.
మహా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30 దాకా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హుటాహుటిన బారామతి చేరు కుని అజిత్ కుటుంబీకులను ఓదార్చారు. ‘‘జరిగింది నమ్మశక్యం కాని ఘోరం. మంచి మిత్రున్ని కోల్పోయాను’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. అజిత్ మృతితో తాను పెద్దన్నయ్యను కోల్పోయానంటూ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మరణం మహారాష్ట్రకు తీరని లోటన్నారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలు. వారికి కుమారులు పార్్థ, జై ఉన్నారు. 66 ఏళ్ల అజిత్ మృతితో మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహా యుతి అధికార కూటమిలో భారీ శూన్యమే ఏర్పడింది. అంతేగాక ఆయన సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆ చివరి క్షణాలు...
జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పుణెలో నాలుగు ప్రచార ర్యాలీల్లో పాల్గొనే నిమిత్తం అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి విమానంలో బారామతి బయల్దేరారు. అది వీఎస్ఆర్ వెంచర్స్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన 9 సీట్ల సామర్థ్యమున్న చిన్న లియర్జెట్–45 మోడల్ విమానం. ప్రమాదం జరిగిన తీరును పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ‘‘విమానం ఉదయం 8.10 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి బయల్దేరింది. 8.18కి విమానం బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) పరిధిలోకి వచి్చంది. గాలి తీవ్రత ఏమీ లేదని, 3 కి.మీ. దాకా స్పష్టమైన విజిబిలిటీ ఉందని పైలట్కు ఏటీసీ సిబ్బంది తెలిపారు.
8.40కల్లా విమానం బారామతి విమానాశ్రయాన్ని సమీపించి లాండింగ్కు సిద్ధమైంది. బారామతి విమానాశ్రయం ‘అన్కంట్రోల్డ్ ఎయిర్ఫీల్డ్’. ఇలాంటి విమానాశ్రయాల్లో ఏటీసీ టవర్ ఉండదు. దాంతో దృశ్యమానత తదితరాల ఆధారంగా పైలట్లే తమ విచక్షణ మేరకు లాండింగ్ చేస్తారు. వారికి ఎయిర్ ట్రాఫిక్ సమాచారాన్ని అందజేయడంలో స్థానిక విమానయాన శిక్షణ సంస్థల పైలట్లు, ఇన్స్ట్రక్టర్లు సాయపడుతూ ఉంటారు. 8.40 గంటలకు రన్వే 11పై విమానం లాండింగ్కు ఏటీసీ అనుమతించింది. గాలి వేగం, దృశ్యమానత (విజిబిలిటీ) ఎలా ఉన్నాయని ఏటీసీ ఆరా తీయగా రన్వే కన్పించడం లేదని పైలట్ చెప్పారు.
లాండింగ్ ప్రయత్నం మానుకుని ‘గో అరౌండ్’ప్రక్రియను అనుసరించి విమానం గాల్లోనే మరో రౌండ్ తిరిగింది. ఆ తర్వాత కూడా రన్వే కన్పించడం లేదని పైలట్ తెలిపారు. అది కన్పించాక కాల్ చేస్తామని చెప్పారు. తర్వాత కొద్ది సెకన్లకే రన్వే కని్పస్తున్నట్టు చెప్పారు. దాంతో ఉదయం 8.43 గంటలకు రన్వే 11పై లాండింగ్కు ఏటీసీ అనుమతించింది. కానీ ఏటీసీ లాండింగ్ సందేశానికి విమాన సిబ్బంది నుంచి ‘రీడ్బ్యాక్’ఏమీ రాలేదు.
ఏటీసీ సందేశాన్ని పైలట్/కో పైలట్ తిరిగి విన్పించడమే రీడ్బ్యాక్. తర్వాత కాసేపటికే, అంటే 8.44 గంటలకు విమానం రన్వే కొసకు ఎడమవైపున కుప్పకూలి మంటల్లో చిక్కింది. దాంతో హుటాహుటిన ఎమర్జెన్సీ సరీ్వసులను ఘటనా స్థలికి తరలించారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. అజిత్తో పాటు విమానంలోని వారంతా దుర్మరణం పాలయ్యారు’’అని ప్రకటన పేర్కొంది. విమానం నేరుగా నేలపై బండరాయిని ఢీకొట్టినట్టు చెబుతున్నారు. అందుకే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని సమాచారం. ప్రమాదానికి ముందు ఆపదలో ఉన్నట్టు తెలిపే ‘మే డే’కాల్ ఏదీ పైలట్ నుంచి రాలేదని డీజీసీఏ స్పష్టం చేసింది.
అటూ ఇటూ ఊగింది ప్రత్యక్ష సాక్షులు
విమానం కుప్పకూలేందుకు కొద్దిసేపటి ముందు అదుపు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. విమానాశ్రయాన్ని సమీపించి కిందిదాకా వచ్చిన అనంతరం లాండ్ అవడానికి బదులుగా విమానం మరోసారి రౌండ్ కొట్టిందని ఒక మహిళ తెలిపారు. ‘‘ఆ వెంటనే విమానం అటూ ఇటూ ఊగుతూ వేగంగా కిందివైపు దూసుకొచి్చంది. అదే ఊపులో నేలను తాకి పేలిపోయింది’’అని ఆమె చెప్పుకొచ్చారు. పేలుడు శబ్దాలు సుదూరాల దాకా విని్పంచాయన్నారు.
పేలుడు తీవ్రతకు విమాన శకలాలు గాల్లో సుదూరాల దాకా ఎగిరి సమీపంలోని నివాస ప్రాంతాల వద్ద పడ్డట్టు మరికొందరు తెలిపారు. విమానం కుప్పకూలాక వరుసగా నాలుగైదు పేలుళ్లు విన్పించినట్టు వివరించారు. తర్వాత కాసేపటికి దగ్గరికి వెళ్లి మృతులను గుర్తించి అంబులెన్సుల్లోకి చేర్చినట్టు వారు చెప్పారు. తర్వాత కాసేపటికే అగి్నమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. అజిత్తో పాటు విమానంలోని ఐదుగురినీ వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు ఎస్పీ సందీప్సింగ్ గిల్ చెప్పారు.


