BMC Election: 25 చోట్ల బీజేపీ ఆధిక్యం | Maharashtra Mumbai BMC Election Results 2026 Live Telugu, Exit Polls Predict Big Win For Ruling Mahayuti, Opposition Remains Confident | Sakshi
Sakshi News home page

BMC Election: 25 చోట్ల బీజేపీ ఆధిక్యం

Jan 16 2026 7:23 AM | Updated on Jan 16 2026 1:00 PM

Mumbai BMC Elections Results Live Whos Winning

ముంబై: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు(శుక్రవారం) జరుగుతోంది. తొలి ట్రెండ్‌ల ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ 68 స్థానాలతో ముందంజలో ఉండగా, శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ కూటమి 42 స్థానాలతో, కాంగ్రెస్ 11 స్థానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  ఆర్థిక రాజధాని ముంబై (బీఎంసీ)తో పాటు పుణె, నాగ్‌పూర్ తదితర నగరాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే, సాంగ్లీ, కొల్హాపూర్, వసాయ్-విరార్, మాలెగావ్ వంటి నాలుగు కార్పొరేషన్లలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ప్రాంతాల్లో బీజేపీ వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది.

బీజేపీ ముందంజ: ముంబైలో 227 వార్డులకు గాను ఇప్పటివరకు 98 వార్డుల ట్రెండ్స్ వెలువడగా, బీజేపీ 42 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

సేన (UBT) గట్టి పోటీ: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) 32 స్థానాల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంది.

షిండే వర్గం: ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ప్రస్తుతం 15 వార్డుల్లో ముందంజలో ఉంది.

ధారావిలో కాంగ్రెస్ బోణీ: ధారావిలోని 183వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆశా కాలే ఘనవిజయం సాధించారు. ఆమె షిండే సేన అభ్యర్థి వైశాలి షెవాలే, MNS అభ్యర్థి పారుబాయి కట్కేలపై 1,450 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మాజీ మేయర్ విజయం: వార్డు 182లో శివసేన (UBT) అభ్యర్థి, 7 సార్లు కార్పొరేటర్‌గా పనిచేసిన మాజీ మేయర్ మిలింద్ వైద్య విజయం సాధించారు.

గోరేగావ్‌లో బీజేపీ సత్తా: గోరేగావ్‌లోని బంగూర్ నగర్ (వార్డు 50)లో బీజేపీ అభ్యర్థి తేజస్వి ఘోసల్కర్ విజయం సాధించారు. ఆమె సేన (UBT)కి చెందిన యువ అభ్యర్థి తన్వీ దినేష్ రావును ఓడించి బీజేపీకి కీలక విజయాన్ని అందించారు.

మీరా-భయందర్‌లో క్లీన్ స్వీప్: మీరా-భయందర్ ప్రాంతంలో షిండే సేనతో జరిగిన పోరులో బీజేపీ ఇప్పటికే 8 స్థానాలను కైవసం చేసుకున్నట్లు సమాచారం.

ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో బీజేపీ జెండా: ముస్లింలు అధికంగా ఉండే మాన్‌ఖుర్డ్ (వార్డు 135)లో బీజేపీ అభ్యర్థి నవనాథ్ బాన్ విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.



 

 ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌.. అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించవచ్చనే అంచనా వేశాయి. అయితే.. విపక్ష కూటమి మాత్రం తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. మహారాష్ట​లోని ముంబై, పూణేలతో పాటు పింప్రి-చించ్వాడ్, కొల్హాపూర్, వసాయ్-విరార్, కళ్యాణ్-డోంబివిలి, నాగ్‌పూర్, సోలాపూర్, అమరావతి, థానే, పర్బానీ తదితర మున్సిపాలిటీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 893 వార్డుల్లోని 2,869 సీట్ల కోసం ఈ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 15,931 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో ముంబై నుంచి 1,700 మంది, పూణే నుంచి 1,166 మంది అభ్యర్థులు ఉన్నారు. 

 

గురువారం జరిగిన పోలింగ్‌లో దాదాపు 1.03 కోట్ల మంది ఓటర్లు 1,700 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. దక్షిణ ముంబైలో ఓటింగ్ శాతం నిరాశాజనకంగా నమోదైంది. ముఖ్యంగా కులాబా ప్రాంతం (వార్డు 227)లో మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి కేవలం 15.73 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇది ముంబై సగటు పోలింగ్ శాతం 41.08 కన్నా చాలా తక్కువ. 2017 ఎన్నికల్లోనూ ఇక్కడ తక్కువ పోలింగ్ నమోదు కాగా, ఈసారి కూడా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావడానికి ఆసక్తి చూపలేదు. హౌసింగ్ సొసైటీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అధికారులు తెలిపారు.

‘యాక్సిస్ మై ఇండియా’ అంచనాల ప్రకారం.. మొత్తం 227 వార్డులకు గాను బీజేపీ-శివసేన కూటమి 42 శాతం ఓటు షేర్‌తో 131 నుంచి 151 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరేలు చేతులు కలిపినప్పటికీ, మహా వికాస్ అఘాడి (శివసేన యూబీటీ-ఎంఎన్‌ఎస్‌- ఎన్‌సీపీ(ఎస్‌పీ)కూటమి 58-68 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి కేవలం 12-16 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

బీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు (జనవరి 16) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపు 2,299 మంది అధికారులు తమ విధులను నిర్వహించనున్నారు. విక్రోలి, కాందివలిలోని స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఉదయం 11 గంటల కల్లా ఫలితాల సరళిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.

బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114 కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహాయుతి ఈ మార్కును సులభంగా దాటేస్తుందని భావిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిన తర్వాత జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో  ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత  ఏ‍ర్పడింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ  పోరులో ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తమ కూటమి 150 సీట్లకు పైగా గెలుచుకుంటుందని, మేయర్ పీఠంపై మరాఠీ హిందువే కూర్చుంటారని శివసేన నేత రాజు వాఘ్మారే ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు మహారాష్ట్ర భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపనున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement