మహారాష్ట్ర రాజకీయాల్లో మరో చీలిక రానుందా?.. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ సంచలనంగా మారాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే వర్గం త్వరలో చీలిపోయే అవకాశం ఉందని తెలిపారు. మహాయుతి మిత్రపక్షంలో 22 మంది ఎమ్మెల్యేలు సీఎంతో చాలా సన్నిహితంగా ఉన్నారని త్వరలో వారు జంపు జిలానీలయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
21వ శతాబ్ధపు భారత రాజకీయాల్లో మహారాష్ట్ర రాజకీయాలు గుర్తుండిపోతాయి. ఎత్తులకు పైఎత్తులు, పార్టీల జంప్, ప్రభుత్వాలని కూలగొట్టడం లాంటివి అక్కడ ప్రస్తుతం కామన్గా మారాయి. 2022లో శివసేన పార్టీని చీల్చి 40 మంది ఏమ్మెల్యేలతో ఆపార్టీ మాజీ నేత ఏకనాథ్ షిండే ప్రభుత్వాన్ని కూల్చారు. బీజేపీతో చేతులు కలిపి సీఎంగా మారారు.
దాని అనంతరం అజిత్ పవార్ సైతం ఎన్సీపీలో చీలిక తెచ్చి 41 మంది ఎమ్మెల్యేలతో బయిటకి వచ్చారు. తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కలిశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అసలైన శివసేన శిండేదేనని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ 2024లో ప్రకటించారు. దీంతో మరాఠా రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఎవరికి అర్థం కాకుండా మారింది.
ఈ నేపథ్యంలో శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. మహౌతి మిత్రపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు చాలా దగ్గరగా ఉన్నారని త్వరలో వాళ్లు ఆయనతో కలిసే అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో పరోక్షంగా శిండే వర్గాన్ని హెచ్చరించారు. అంతే కాకుండా వర్లీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 22 మంది తనను వైస్ కెప్టెన్ అంటారని పరోక్షంగా మంత్రి ఉదయ్ సమంత్ ను ఉద్దేశించి మాట్లాడారు.
అయితే గతంలోనూ అజిత్ పవార్, శిందేలతో పాటు ఉదయ్ సమంత్ కూడా మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని శివసేన (UBT) వాదించింది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) మహాయుతిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. 2024లో జరిగిన ఎన్నికలలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.


