విమాన టికెట్ల ధర పెంపుపై కేంద్రం సీరియస్‌ | Indigo Crisis: Centre Serious On Airlines Ticket Price Hikes | Sakshi
Sakshi News home page

విమాన టికెట్ల ధర పెంపుపై కేంద్రం సీరియస్‌

Dec 6 2025 1:21 PM | Updated on Dec 6 2025 1:36 PM

Indigo Crisis: Centre Serious On Airlines Ticket Price Hikes

ఇండిగో సంక్షోభంతో గగనతల ప్రయాణం ఒక్కసారిగా ఖరీదుగా మారింది. అయితే విమాన టికెట్ల ధరల పెంపుపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. సంక్షోభాన్ని క్యాష్‌ చేసుకోవద్దని ఎయిర్‌లైన్స్‌లకు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. నిర్దేశించిన ఛార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. 

భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుతో.. మిగతా ఎయిర్‌లైన్స్‌ క్యాష్‌ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలు రూట్లలో దాదాపు 10 రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అయితే మీడియా కథనాలు, సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా ఈ దోపిడీ ప్రభుత్వం దృష్టికి చేరింది. అయితే.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణికులను కొన్ని విమానయాన సంస్థలు దోచుకోవడం సరికాదని కేంద్రం చెబుతోంది. అడ్డగోలుగా రేట్లు పెంచితే చూస్తూ ఊరుకోబోమని.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ జారీ చేసింది.

మరోవైపు.. ఇండిగో సంక్షోభంగా ఐదో రోజుకి అడుగపెట్టింది. దేశంలోని పలు ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల వద్ద ప్రయాణికుల నిరీక్షణ కొనసాగుతోంది. ప్రయాణికులకు  ముందస్తు సమాచారం ఇవ్వడంలో ఎయిర్‌లైన్స్‌ ఘోరంగా విఫలం అయ్యిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. విమానాల రద్దు గురించి తెలీక.. సరైన సమాచారం లేక.. ఎయిర్‌పోర్టులలో హెల్ప్‌డెస్క్‌ల వద్ద ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇండిగో సిబ్బంది తమతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ‘‘క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?’’ అంటూ ఎయిర్‌లైన్స్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement