ముంబై: మహారాష్ట్రలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బారామతిలో విమాన ప్రమాదం కారణంగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో, విమానంలో ప్రయాణించిన అజిత్ పవార్, ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు డీజీసీఏ (DGCA) వెల్లడించింది. దీంతో, అజిత్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

రాజకీయ ప్రస్థానం..
అజిత్ పవార్ స్వగ్రామం పూణే జిల్లాలోని బారామతి తాలూకాలోని కటేవాడి. అహ్మద్ నగర్ జిల్లాలోని రాహురి తాలూకాలోని తన తాత గ్రామం డియోలాలి (ప్రవర)లో పవార్ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్రావ్ పవార్.. సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు. పవార్ పదో తరగతి వరకు డియోలాలిలో విద్యాభ్యాసం చేశాడు. అజిత్ పవార్ కళాశాల విద్య కోసం ముంబై వచ్చారు. తన విద్యను పూర్తి చేసిన తరువాత బారామతికి వచ్చి అక్కడి సహకార సంఘాల నుండి సామాజిక, రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించారు. అజిత్ పవార్ 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సంవత్సరంలో అతను కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల బోర్డుకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్గా వ్యవహరించారు.

1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి.. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


