ముంబై: ఎన్సీపీ నేత, దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ షిండే, మహారాష్ట్రకు చెందిన నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అజిత్ పవార్ మృతికి మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతకు ముందు.. అజిత్ దాదా కడసారి చూపు కోసం రాజకీయ నేతలు, అభిమానులు బారామతిలోని ఆయన నివాసం వద్దకు క్యూ కట్టారు. ఆపై కటేవాడిలో కాసేపు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర నడిచింది. దారి పొడవునా అల్విదా అజిత్ దాదా నినాదాలు హోరెత్తాయి.
హఠాన్మరణం
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన సొంత నియోజక వర్గం బారామతిలో జరగబోయే ప్రచార సభలకు బుధవారం ఉదయం అజిత్ పవార్ చార్టెడ్ ఫ్లైట్లో బయల్దేరారు. అయితే ల్యాండింగ్ చివరి నిమిషంలో విమానం అదుపు తప్పి సమీపంలోని గోజుబావి గ్రామ సమీంలోని గుట్టల్లో కూలిపోయింది.
బండ రాయిని విమానం బలంగా ఢీ కొట్టి రెండు ముక్కులై.. పేలి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది, పైలెట్లు, ఫ్లైట్ అటెండెంట్ మొత్తం ఐదుగురు మరణించారు. ప్రమాదం ధాటికి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయాయి. అయితే చేతి వాచీ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అజిత్ పవార్తో పాటు ప్రమాదంలో మరణించిన మిగతా వాళ్ల మృతదేహాలకు ఈ ఉదయం పోస్టుమార్టం పూర్తైంది. దీంతో పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బంధువులు మృతదేహాలను తమ స్వస్థలాలకు తరలించారు.

ఈ ఘటనపై ఏఏఐబీ (Aircraft Accident Investigation Bureau.. విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఘటనా స్థలం నుంచి పలు ఆధారాలు సేకరించింది. బ్లాక్ బాక్స్ను రికవరీ చేసుకుని డీ కోడింగ్ చేసుకునే పనిలో ఉంది. నిర్ణీత కాల వ్యవధిలో దర్యాప్తు జరుగుతుందని ఈ సందర్భంగా ఒక స్పష్టత ఇచ్చింది.


