నేడు జీవితం మొత్తం స్మార్ట్ స్క్రీన్ల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో, యువతలో డిజిటల్ స్క్రీన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. శారీరకంగానూ, మానసికంగాను ఎన్నో ఇబ్బందులను తెస్తుంది. ఇదే ఇపుడు మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన ఒక సర్పంచ్ అద్భుతమైన ఆలోచనకు నాంది పలికింది. పిల్లలను, యువతను డిజిటల్ స్క్రీన్నుంచి బయటపడవేసే మహత్తర ప్రణాళిక రూపొందించారు. ఆ నిర్ణయం ఇపుడు అద్భుతమైన ఫలితాలనూ సాధిస్తూ, ఆ గ్రామం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా చేస్తోంది.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న అగ్రాన్ దుల్గావ్ (Agran Dhulgaon) అనే ఒక చిన్న గ్రామం డిజిటల్ స్క్రీన్ వినియోగంపై పరిమితులను విధించింది. ప్రతిరోజు నాలుగు గంటల పాటు డిజిటల్ స్క్రీన్కి దూరంగా ఉండాలని ఆ గ్రామ సర్పంచ్ శివ్దాస్ భోస్లే నిర్ణయించారు. ఉదయం 5 గంటలకు ఒకసారి, సాయంత్రం 7 గంటలకు ఒకసారి మొత్తంగా ఒక రోజులో నాలుగు గంటల పాటు మొబైల్ ఫోన్కి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
నిర్ణీత సమయానికి గ్రామంలో ఒక సైరన్ (Siren) మోగుతుంది. ఆ సైరన్ వినగానే అందరూ తమ మొబైల్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పక్కన పెట్టేస్తారు. ఈ డిజిటల్ అలవాట్లు పిల్లల భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలని, వారు ప్రతిరోజు నిర్దిష్ట సమయం చదువుకు కేటాయించేలా ఈ నిబంధనను తీసుకువచ్చారు.
ఈ డిజిటల్ డిటాక్స్ (Digital Detox) నిర్ణయం గ్రామంలో ఎంత అద్భుతమైన ఫలితాల్ని తీసుకు వచ్చిందంటే... ఏకంగా ఆ గ్రామంలోని 53 మంది విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్లను గెలుచుకునేంతగా... మరికొంత మంది విద్యార్థులు యూపీఎస్సీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ వంటి పోటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులయ్యారు. గ్రామ సర్పంచ్ శివ్దాస్ భోస్లే తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ట్రెండ్సెట్టర్ సీతారామన్!


