ఒమన్ తీరంలో భారతీయుడి మృతి
దుబాయ్: ఒమన్ సముద్ర తీరంలో ఘోరం జరిగింది. భారీ చమురు ట్యాంకర్ను పేలు డు పదార్థాలతో నింపిన మరో పడవ ఢీకొట్టడంతో ఒక భారతీయుడు మృతిచెందాడు. ఆ ట్యాంకర్లోని ఇతర సిబ్బందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మస్కట్ గవర్నరేట్లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్కు 52 నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది.
ఎంకేడీ వ్యోమ్ అనే పేరు గల ఈ చమురు ట్యాంకర్పై రిపబ్లిక్ ఆఫ్ ద మార్షల్ ఐలాండ్స్ జెండా ఉంది. ఘటన జరిగిన సమయంలో ట్యాంకర్లో 59,463 మెట్రిక్ టన్నుల చమురు ఉన్నట్లు తెలిసింది. మనుషులెవరూ లేని భారీ పడవ ఢీకొట్టడంతో చమురు ట్యాంకర్ ఇంజన్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే విధుల్లో ఉన్న భారతీయుడు మృతిచెందాడు. అతడి వివరాలు తెలియరాలేదు. ట్యాంకర్లో ఇంకా 21 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 16 మంది భారతీయులు కాగా, నలుగురు బంగ్లాదేశీలు, ఒకరు ఉక్రెయిన్ పౌరుడు. వారందరినీ ఒమన్ అధికారులు రక్షించారు.


