సోమవారం ఢిల్లీలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో మోదీ
అరుదైన ఖనిజాల దిగుమతి.. భారత్, కెనడా మధ్య కుదిరిన ఒప్పందాలు
త్వరలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఖరారు.. ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, మార్క్ కార్నీ భేటీ
ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని నాలుగేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చాలని నిర్ణయం
న్యూఢిల్లీ: యురేనియం, అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో భారత్, కెనడా మధ్య కీలకమైన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా నూతన ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశారు.
రక్షణ, క్రిటికల్ టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, మార్క్ కార్నీ తీర్మానించారు. కెనడా ప్రధానితో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, కెనడా సంబంధాలు ఇప్పుడు నూతన శక్తి, పరస్పర విశ్వాసం, సానుకూలతను సంతరించుకున్నాయని ఉద్ఘాటించారు. యురేనియం ఒప్పందంలో భాగంగా భారత అణు ఇంధన రంగానికి కెనడా సహకారం అందించబోతోంది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా చేయనుంది.
సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలి
ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసాత్మక భావజాలం కేవలం భారత్, కెనడాలకే కాకుండా భూగోళంపై మొత్తం మానవాళికి ముప్పుగా మారాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెండు దేశాలదీ ఒక్కటే మాట అని వివరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంతోపాటు రాడికలైజేషన్పై పోరాటంలో భారత్, కెనడా మధ్య సహకారం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి అత్యంత కీలకమని అన్నారు. కెనడాపై దాడులు, పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, అక్కడి ప్రజల భద్రతకు సవాళ్లు ఎదురవుతుండడంపై మోదీ, మార్క్ కార్నీ చర్చించారు. అభిప్రాయాలు పంచుకున్నారు.
వివాదాలు, ఘర్షణలను సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. అలాంటి ప్రయత్నాలకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి భద్రత కోసం ఆయా దేశాలతో కలిసి పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు బలహీన పడుతున్న నేపథ్యంలో భారత్తో వాణిజ్యానికి కెనడా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా తమ ఇరుదేశాల వాణిజ్య సంబంధాలను మరింత విస్తృతపర్చుకోవాలని ప్రధాని మోదీ, మార్క్ కార్నీ నిర్ణయించుకున్నారు.
భారత్లో కెనడా వర్సిటీ క్యాంపస్లు
ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని మరో నాలుగేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ధ్యేయమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. భారత్, కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని, దీనివల్ల రెండు దేశాల్లో నూతన పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కెనడా పెన్షన్ నిధి నుంచి భారత్లో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారని, మనదేశ ప్రగతి చరిత్ర పట్ల కెనడాకు ఉన్న బలమైన విశ్వాసానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేశారు. భారత్, కెనడాల మధ్య ప్రస్తుతం వార్షిక వాణిజ్యం 13 బిలియన్ డాలర్లుగా ఉంది. కెనడా నుంచి అరుదైన ఖనిజాలు దిగుమతి చేసుకోవడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
తద్వారా సప్లై చైన్స్ బలోపేతం అవుతాయన్నారు. ఇంధన రంగంలో ‘తదుపరి తరం భాగస్వామ్యం’ నిరి్మంచుకుంటున్నామని చెప్పారు. హైడ్రోకార్బన్లు సహా పునరుత్పాధక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ స్టోరేజీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. దీర్ఘకాలంలో యురేనియం కోసం కెనడాలో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
రక్షణ రంగంలో భారత్, కెనడాల మధ్య సహకారం నానాటికీ పెరుగుతుండడం రెండు దేశాల లోతైన మైత్రికి, పరస్పర విశ్వాసానికి ప్రతీక అని వివరించారు. కెనడా యూనివర్సిటీల క్యాంపస్లు మన దేశంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలియజేశారు. విద్యా రంగంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటాయని స్పష్టం చేశారు. కీలక రంగాల్లో భారత్తో సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్నదే తమలక్ష్యమని మార్క్ కార్నీ తేలి్చచెప్పారు. ఇరుదేశాలు లబ్ధి పొందేలా కలిసి పని చేస్తామన్నారు. యురేనియం ఒప్పందాన్ని భారత్, కెనడాల స్నేహానికి ప్రతీకగా అభివరి్ణంచారు.
సంస్కరణలు, సులభతర వాణిజ్యానికి పెద్దపీట: మోదీ
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దేశీయంగా వినియోగం పెరుగుతుండడం, భారీగా పెట్టుబడులు వస్తుండడం, డిజిటల్ ఎకానమీ వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. సోమవారం ఇండియా–కెనడా సీఈఓ ఫోరమ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. సంస్కరణలతోపాటు సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నామని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరుగులు తీయడం తథ్యమని స్పష్టం చేశారు. కెనడాతో కలిసి త్వరలోనే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఏపీఏ) కుదుర్చుకుంటామని వెల్లడించారు. ఈ సదస్సులో భారత్, కెనడా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.


