యాడున్నరో.. ఎట్టున్నరో..? | Gulf War Tension Worries Markapuram Families Relatives Stuck | Sakshi
Sakshi News home page

యాడున్నరో.. ఎట్టున్నరో..?

Mar 6 2026 1:42 PM | Updated on Mar 6 2026 2:05 PM

Gulf War Tension Worries Markapuram Families Relatives Stuck

మార్కాపురం జిల్లా:  పశ్చిమాసియాలోని అరబ్‌ దేశాల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు మార్కాపురం జిల్లాలోని వందలాది కుటుంబాలను తీవ్ర భయాందోళనకు గురిచేయడమే కాదు కన్నీళ్లు కురిపిస్తున్నాయి. జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫోన్లు, వాట్సప్‌లు, వీడియో కాల్స్‌పై అక్కడి ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతోపాటు తాత్కాలికంగా నిలిపివేయడంతో బంధుమిత్రుల సమాచారం తెలియక వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం, కంభం, గిద్దలూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది గల్ఫ్‌ దేశాలైన దుబాయ్, కువైట్, ఖతార్‌లో ఉంటున్నారు. పొట్ట చేతపట్టుకుని కొందరు, గల్ఫ్‌లో బంధువుల వద్దకు మరికొందరు వెళ్లారు. 

ఈ క్రమంలో ఇరాన్‌కు ఇజ్రాయేల్, అమెరికా మధ్య యుద్ధం తలెత్తడంతో గల్ఫ్‌ దేశాలకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నా విమానాల రద్దుతో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రోజురోజుకూ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

అరబ్‌ దేశాల్లో ఉంటున్న వారు సాధారణంగా ప్రతి రంజాన్‌ పండగకు స్వగ్రామాలకు వచ్చి కొద్దిరోజులు ఉండి మళ్లీ అక్కడికి వెళ్తుంటారు. ఈసారి మాత్రం పండగ 15 రోజుల్లో ఉందనగా ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా క్షిపనులతో విరుచుకుపడటం, ఇరాన్‌ భీకర ప్రతిదాడులకు దిగడంతో వారి ప్రయాణానికి అవాంతరం ఏర్పడింది. తాము స్వదేశానికి రాలేమంటూ పలువురు తమ బంధువులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. గత సోమవారం మధ్యాహ్నం నుంచి అక్కడి ప్రభుత్వాలు వీడియో, వాట్సప్‌ కాల్స్‌ను నిలిపివేయడంతో మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల్లో ఉంటున్న బంధువులు ఆందోళన చెందుతున్నారు.  

విమానం టికెట్‌ రద్దయింది  
నా కూతురు, అల్లుడు కువైట్‌కు సమీపంలోని ఫర్మేనియా సిటీలో ఉంటున్నారు. నేను ఫిబ్రవరి 18వ తేదీన వారి వద్దకు వచ్చాను. మార్చి 6వ తేదీన మళ్లీ మార్కాపురం వచ్చేందుకు విమానం టికెట్‌ బుక్‌ చేసుకున్నా. ఆదివారం ఉదయం ఊహించని విధంగా యుద్ధం ప్రారంభం కావడంతో విమాన టికెట్లు క్యాన్సిల్‌ చేశారు. కువైట్‌ మీద కూడా ఇరాన్‌ బాంబులు వేసింది. మా ప్రాంతంలో ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదు. బయట కూడా ఎవరూ తిరగడం లేదు. కువైట్‌ రాజు మా ప్రాంతానికి వచ్చి యోగక్షేమాలు అడిగారు. కానీ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. పరిస్థితులు త్వరగా చక్కబడితే బాగుంటుందని కోరుకుంటున్నాం.  
     – ఎన్‌.బద్రి, మార్కాపురం  

దుబాయ్‌లో టెన్షన్‌గా ఉంది  
నా కుమారుడు అబ్దుల్‌ రహీమ్‌ దుబాయ్‌లో ఐటీ వింగ్‌లో పనిచేస్తున్నాడు. యుద్ధం కారణంగా ప్రభుత్వం వాట్సప్, వీడియో కాల్స్‌ నిషేధించింది. అతి కష్టంమీద ఈ రోజు ఫోన్‌లో మాట్లాడాడు. ప్రస్తుతానికి వర్క్‌ఫ్రమ్‌ హోం కింద దుబాయ్‌లోని ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది.  
    – అజీజ్, మార్కాపురం  

Advertisement
 
Advertisement
Advertisement