సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. కాగ్ రిపోర్టు డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏపీలో ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. కల్పిత జీఎస్డీపీ గణాంకాలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేస్తున్నారంటూ కాగ్ లెక్కలను బహిర్గతం చేశారు. తప్పుడు లెక్కలపై బొత్స మండిపడ్డారు.
విపక్షనేత బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా..‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి, మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిగా, మీరు కాగ్ వెబ్సైట్ నుండి డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పడం నిజంగా ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు మీరు సిద్ధంగా లేరన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, 23 రాష్ట్రాలకు సంబంధించిన CAG MKI నివేదికలను ఈ ట్వీట్కు జతపరుస్తున్నాము. అలాగే వృద్ధి రేట్లు ఎలా గణించారో వివరింగా తెలియజేసే స్లైడ్స్ను కూడా ఈ ట్వీట్లో పొందుపరుస్తున్నాం. (https://tinyurl.com/teswmtu2)
రాష్ట్రం ప్రస్తుతం ఒక ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో అది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మీ ప్రభుత్వం కల్పితమైన GSDP గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న తప్పుడు అభిప్రాయాన్ని కల్పిస్తోంది.
2024–25లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75% (నామినల్ GSDP) వృద్ధి సాధించిందదని మీ ప్రభుత్వం చెప్తోంది. కాని అదే సమయంలో దేశ వృద్ధి రేటు 9.8% మాత్రమే. అలాగే 2025–26లోకూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 10.75% వృద్ధి సాధిస్తుందని చెప్తున్నారు. కాని దేశ వృద్ధి రేటు 8.0%గానే అంచనా వేశారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 వరకు రెండు సంవత్సరాల కాలానికి CAGR 11.09%గా వస్తుంది. అదేవిధంగా రియల్ GSDP వృద్ధిలో ఈ సంవత్సరం రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలో 3వ స్థానంలో ఉందని మీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.
అయితే మీ ప్రభుత్వం తరఫున మీరు ఇస్తున్న అంకెలు, గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ విడుదల చేసినవి కావు. ఇవన్నీచంద్రబాబుగారి కార్యాలయం తయారు చేసిన గణాంకాలు, కాకిలెక్కలు. ఈ గణాంకాలు నిజమైతే, అదే స్థాయిలో ప్రభుత్వ ఆదాయాల్లో కూడా వృద్ధి కనిపించాలి. CAG ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు సంబంధించి విడుదలచేసిన గణాంకాలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా వెల్లడి అవుతోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయాలు కేవలం 1.97% CAGR మాత్రమే పెరిగాయి.
11.09% GSDP వృద్ధి చూపిస్తున్న రాష్ట్రం, కేవలం 1.97% పన్ను ఆదాయ వృద్ధిని మాత్రమే సాధించడం ఎలా సాధ్యమో ప్రపంచంలోని ఆర్థిక శాస్త్రవేత్తలకూ ఆశ్చర్యం కలిగించే విషయం. మీరు చెప్పుకుంటున్నట్టుగా ‘విజనరీ నాయకత్వం’ కింద తయారుచేసిన కల్పిత గణాంకాల వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి 9 నెలలకు సంబంధించి 23 రాష్ట్రాలకు వచ్చిన ఆదాయాలకు సంబంధించిన ఖాతాలనుకూడా CAG అప్లోడ్ చేసింది.
ఆ రాష్ట్రాలతో పోల్చి చూస్తే పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. 23 రాష్ట్రాలలో పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది — అంటే కిందనుంచి రెండవ స్థానం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం అదే కాలంలో 9.64% పెరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు కేవలం 1.97% మాత్రమే పెరిగాయి.
🚨 #CAGExposedCBN
రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి ( @PayyavulaOffl ),
మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిగా, మీరు CAG వెబ్సైట్ నుండి డాక్యుమెంట్లు డౌన్లోడ్… pic.twitter.com/iaDv2RTCSM— YSR Congress Party (@YSRCParty) March 7, 2026
కానీ, మీరు ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మించి ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధ్యత గల విపక్షంగా వాస్తవాలను మేం శాసన మండలిలో ప్రస్తావించినప్పుడు, రాష్ట్రం చూపుతున్న ఈ నిరాశాజనక ఆర్థిక పనితీరుపై ఒక ఆర్థిక మంత్రిగా మీరు ఆత్మపరిశీలన చేసుకోకుండా, మేం సభద్వారా ప్రజలముందు ఉంచిన ఈ గణాంకాలను ఎగతాళి చేస్తూ, వ్యంగ్యంతో వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు మేము జతపరిచిన అన్ని పత్రాలను మీరు పూర్తిగా పరిశీలించి, మేము చేసిన ఆరోపణలను ఖండించగలరా? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం (State’s Own Tax Revenues) వృద్ధి రేటు CAGR 1.97% కంటే ఎక్కువగా ఉందని మీరు చెప్పగలరా?. పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 22వది కాదని, అంతకంటే మెరుగైన స్థానంలో ఉందని మీరు నిరూపించగలరా?. ఈ గణాంకాలను మీరు ఖండించకపోతే, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తిగా మీరు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని భావించినట్టే! అని పోస్టులో పేర్కొన్నారు.


