రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో మరొకరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రి శివారు లాలాచెరువు ప్రాంతానికి చెందిన శానాపతుల రామలక్ష్మి(73) మృతి చెందారు. ఈరోజు(ఆదివారం, మార్చి 8వ తేదీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణం కోల్పోయారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి డెల్టా హాస్పిటల్లో రామలక్ష్మి చికిత్స పొందుతున్న ఆమె.. ఈరోజు తుది శ్వాస విడిచారు.
దాంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య 12గా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు రోగులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు.
కాగా, రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై, నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో రోజుకొకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూండటం.. బాధిత కుటుంబాలను తీరని విషాదంలో ముంచుతోంది.
మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే, వారి విషయంలో విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు సైతం ఇప్పటికే చేతులెత్తేశారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సే కొనసాగించాలంటూ ఉచిత సలహా ఇచ్చి వెనుదిరిగారు. తాజాగా మరొకరు మృతి చెందడంతో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.


