పండుగను ప్రారంభిస్తున్న పాస్టర్ జాషువా మోజస్ తదితరులు
అమరావతి: పల్నాడు జిల్లా లేమల్లె గ్రామంలో 49వ గుడారాల పండుగ గురువారం వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది విశ్వాసులు తరలివచ్చారు. దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తును స్తుతి గీతాలతో ఆరాధించారు. ఈ సందర్భంగా హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన విశ్వాసులకు క్రీస్తు కృపాకటాక్షాలు నిత్యం ఉండాలని ప్రార్థించారు.
తొలుత దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువామోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వాసుల కరతాళ ధ్వనుల మధ్య భారత జాతీయ పతాకంలోని మూడు రంగుల బెలూన్లను, శ్వేతవర్ణ పావురాలను ఎగురవేసి పండుగను ప్రారంభించారు. అనంతరం విశ్వాసులు ఆలపించిన క్రీస్తు స్తుతిగీతాలు ఆకట్టుకున్నాయి.
‘‘హోసన్నా సౌందర్యపూర్ణుడా..’’ అనే పాటల పుస్తకాన్ని ఏలూరుకు చెందిన జ్యోతిరాజ్, స్పర్ధనరాజ్ ఆవిష్కరించారు. స్తుతి గీతాల వీడియో ఆల్బమ్ను అమెరికాకు చెందిన దైవజనులు ఎర్నెట్పాల్ ఆవిష్కరించారు. తొలిరోజు దైవజనులు అబ్రహం, జాన్వెస్లీ, రమేష్, ప్రెడ్డిపాల్, రాజు ఆలపించిన స్తుతిగీతాలు విశ్వాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.


