తాడేపల్లి : ఏపీ అసెంబ్లీలో కాకి లెక్కలు చెబుతూ కూటమి ప్రభుత్వం కాలం గడిపిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం లెక్కలు వాస్తవాలకు సంబంధంల లేకుండా ఉందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అమలు చేయమంటే.. సూపర్ స్కామ్ చేస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దల వైఖరిని తప్పుబట్టారు చంద్రశేఖర్.
ఈరోజు(శనివారం, మార్చి 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు మత విద్వేషాలు పెంచేలా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇందుకేనా అసెంబ్లీని నిర్వహించేది? అంటూ ప్రశ్నించారు.
‘ జనంతో నడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది జగన్. అదే జనాన్ని పొడిచి ప్రభుత్వంలోకి వచ్చింది చంద్రబాబు. వైఎస్ జగన్ని దూషించటం, లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మటానికే అసెంబ్లీలో ప్రాధాన్యత ఇచ్చారు. మండలి ఛైర్మన్ని మతం పేరుతో అవమాన పరిచారు. లడ్డూ మీద చర్చ జరిగితే వారి పాపాలు బయటకు వస్తాయని భయపడ్డారు. అందుకే ఛైర్మన్కి మతాన్ని ఆపాదించారు. మంత్రులేమో కామిడీలు చేస్తుంటే, కామిడీ ఆర్టిస్టులు మంత్రుల్లాగ మాట్లాడుతున్నారు. ఉద్యోగాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన చంద్రబాబు ఇకమీదట దేశ రాజకీయాల్లోకి వెళ్తారట. ఆర్థిక క్రమశిక్షణ లేని వైనం మీద కాగ్ కడిగి పారేసింది. జాబ్ కేలండర్ అడిగితే లోకేష్ డేట్లు మార్చుకుంటూ పోతున్నారు. లూటీ చేసి లాఠీలతో బెదిరిస్తున్నారన్నారు’ అని విమర్శించారు.


