సాక్షి, తాడేపల్లి: హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరాపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి ఇందాపూర్ డెయిరీ ఎంటర్ అయ్యిందని తెలిపారు. గతంలో కేజీ నెయ్యి రూ.320కి అమ్మిన ఇందాపూర్ డెయిరీ ఇప్పుడు కేజీ నెయ్యి రూ.650కి అమ్ముతోందన్నారు. భోలే బాబా అసలు పేరు హర్ష్ ఫ్రెష్ డెయిరీ అని చెప్పుకొచ్చారు. అన్నీ బాబు హయాంలోనే జరిగితే వైఎస్సార్సీపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. 2014 నుంచి చూస్తే వీరి బండారం బయటపడుతుందన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఇందాపూర్ డెయిరీని 2026, ఫిబ్రవరి 10 వరకు హెరిటేజ్కు మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థగా చూపించారు. ఈ గుట్టు బయటకు రాగానే హెరిటేజ్ వెబ్సైట్ నుంచి 2026 ఫిబ్రవరి 15న కోమ్యానిఫ్యాక్చరింగ్గా చూపించారు. అలాగే, ఫిబ్రవరి 14న హెరిటేజ్ ఫుడ్స్ హెడ్ రాజీనామా చేశాడు. 2015లో రూ.278కే ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. 2015లో చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి ఇందాపూర్ డెయిరీ ఎంటర్ అయ్యింది. ల్యాబ్ రిపోర్డులు నెగిటివ్గా రావడంతో 2016లో ఇందాపూర్ డెయిరీ డిస్క్వాలిఫై అయ్యింది. అంటే దాని అర్థం కల్తీ జరిగిందనేగా?. డిస్ క్వాలిఫై అయిన మూడు నెలల్లోనే 2016 ఏప్రిల్ 26న ఇందాపూర్కు మళ్లీ అర్హత కల్పించారు. 2018 నవంబర్ 27న ఇందాపూర్కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి రూ.321కే ఆర్డర్ వేశారని వెల్లడించారు.
నాడు 320.. నేడు 658..
2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్లీ చక్రం తిప్పారు. ఇందాపూర్కు మళ్లీ 2025 డిసెంబర్ 16న టెండర్ ఖరారైంది. గతంలో కేజీ నెయ్యి రూ.320కి అమ్మిన ఇందాపూర్ డెయిరీ ఇప్పుడు కేజీ నెయ్యి రూ.658కి అమ్ముతోంది. కేంద్ర ఆధీనంలోని ల్యాబ్ రిపోర్టులతో నెయ్యి టెండర్లు టీటీడీకి రావాలి. ఇది మొదటి నుంచి టీటీడీకి ఉన్న సంప్రదాయం. భోలే బాబా అసలు పేరు హర్ష్ ఫ్రెష్ డెయిరీ. 2018 జూన్ 26న భోలే బాబుకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ బాబు హయాంలో టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. స్వయంగా భోలేబాబా ప్లాంట్ను పరిశీలించినట్టు టెక్నికల్ క్వాలిఫైడ్గా నిర్ధారించినట్టు టీటీడీ తీర్మానం చేసింది.

బాబు హయాంలోనే ట్యాంకర్లు రిజెక్ట్..
2018 మార్చి 6న 82వేల కేజీల నెయ్యి సరఫరా చేయడానికి చంద్రబాబు హయాంలోనే ఆర్డర్ చేశారు. హెరిటేజ్తో భాగస్వామ్యం ఉన్నట్టు భోలేబాబా తెలిపింది. చంద్రబాబు హయాంలోనే టెండర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు హయాంలోనే నెయ్యి సరఫరా అయ్యింది. చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. రిజెక్ట్ అయిన ట్యాంకర్లు బాబు హయాంలోనే టీటీడీకి వచ్చాయి. అన్నీ బాబు హయాంలోనే జరిగితే వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?. వీరి హయాంలో దొరికిన, వీరితోనే వ్యాపార సంబంధం ఉన్న వీరిని గంపగుత్తిగా వైఎస్సార్సీపీకి ఎలా ముడిపెడతారు?.
2014 నుంచి చూస్తే వీరి బండారం బయటపడుతుంది. అన్ని కనెక్షన్లు చంద్రబాబువైపు ఉంటే మాకేం సంబంధం?. అందుకే హెరిటేజ్పై శాసన మండలిలో చర్చ జరగనివ్వడం లేదు. చంద్రబాబు హయాంలోనే తప్పు జరిగింది. 2025 జూలై 25న పంపిన ఆ నాలుగు ట్యాంకర్లు ఆగస్టు, సెప్టెంబర్లో లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్లాయని సీబీఐ సిట్ ఛార్జ్షీట్లో చెప్పింది. రిజెక్ట్ అయిన ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని సీబీఐ సిట్ చెప్పింది. ఇదంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. అబద్ధాలు, మోసాలతో దేవుడితో చంద్రబాబు చెలగాడమాడారు’ అని చెప్పుకొచ్చారు.


