సాక్షి, తాడేపల్లి: ఏపీలో మూడు బడ్జెట్ల్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు.. ప్రజలకు కూడా వరుసగా వెన్నుపోటు పొడుస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ కూడా గాలికి ఎగిరిపోయాయి. చంద్రబాబు పబ్లిసిటీ పీక్.. పర్ఫామెన్స్ వీక్. తప్పుడు లెక్కలతో తన డప్పు తాను కొట్టుకుంటున్నాడు. గ్రోత్ రేట్ పెరిగితే.. తలసరి ఆదాయం కూడా పెరగాలి కదా?. తలసరి ఆదాయం పెరిగితే కొనుగోళ్లు కూడా పెరిగుండాలి కదా?. కొనుగోలు శక్తి పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరగాలి కదా?.
2024-25లో లక్షా 19వేల 927 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. కానీ, వచ్చిన ఆదాయం 94వేల 937 కోట్లు మాత్రమే. పది నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ.75వేల 964 కోట్లు. పెరుగుదల కేవలం 4.25 శాతం మాత్రమే. చంద్రబాబు చెప్పేవన్నీ గారడీ లెక్కలే. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుంది.
చంద్రబాబు మూడు బడ్జెట్ల్లో ప్రజలకు చేసిందేమిటి?. 2026-27కు లక్షా 37వేల 320 కోట్లు ఆదాయం వస్తుందంటున్నారు. ఇప్పటి కన్నా 45 శాతం అధికంగా చూపిస్తున్నారు. ఇది సాధ్యమా?. స్టేట్ రెవెన్యూ పురోగతిలో ఏపీ 22వ స్థానంలో ఉంది. దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఏపీ ఉంది. చంద్రబాబు అసమర్థతకు ఇది నిదర్శనం. ఆదాయంలో కేంద్రం పురోగతి 9.64 శాతం ఉంటే ఏపీ పురోగతి మాత్రం 1.97 శాతం మాత్రమే. జీడీపీ, జీఎస్డీపీపై చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలే. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడం లేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తగ్గుతున్నాయి. రాష్ట్ర ఆదాయాలు బాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తున్నాయి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.



