సాక్షి, అమరావతి: ఇవాళ కూడా సభలో యథావిధిగా ప్రభుత్వం తోకముడిచిందని శాసనమండలి విపక్షనేత, బొత్స సత్యనారాయణ అన్నారు. శాసన మండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు అపవాదు వేశారు. చంద్రబాబు దోపిడీపై చర్చకు రమ్మంటే సభలో గందరగోళం సృష్టించారు. తమ ధన దాహం, దోపిడీ కోసం ప్రసాదంలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చర్చకు రమ్మంటే తిరిగి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు’’ అంటూ బొత్స మండిపడ్డారు.
‘‘మాకు లీగల్ నోటీసులివ్వడం హాస్యాస్పదం. చంద్రబాబు ఎందుకు చర్చకు రావడం లేదు?. మీ ధనదాహం కోసం.. మీ హెరిటేజ్ స్వలాభం కోసం ఇందాపూర్తో ఉన్న మీ సంబంధాలు బయటికి వస్తాయని భయపడుతున్నారు. మేం చెప్పింది వాస్తవం కాదా.. దేవదేవుడి ప్రసాదంపై ఎన్ని నిందలు వేశారు. ఇది మహాపాపం కాదా?. నిజంగా తప్పు చేస్తే వారి పై చర్యలు తీసుకోండనే మేం కోరుతున్నాం. సుప్రీంకోర్టు కూడా మేం చెప్పిందే చెప్పింది. ఇందాపూర్కు హెరిటేజ్ సంస్థకు ఒప్పందాలున్నాయి. ఆ ఒప్పందాల ప్రకారం తమ ధనదాహం కోసం చంద్రబాబు ఆయన కుటుంబం ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డారు.
..చంద్రబాబు ఎంత నంగనాచిలా మాట్లాడాడు. చంద్రబాబు, పవన్, కూటమి నేతలు దేవదేవుడిపై నిందలు వేసి మహా పాపం చేశారు. సాక్ష్యాలు ఉంటే చర్చకు రమ్మంటున్నారు. చర్చ చేస్తే సాక్ష్యాలు బయటికి వస్తాయి. టీడీపీ చేస్తున్న మోసానికి టీటీడీ ఛైర్మన్ పత్రికా ప్రకటన ఇవ్వడమేంటి?. ఛైర్మన్ గారు మీరు టీటీడీకి ఛైర్మన్ టీడీపీకి కాదు. మీరు ఇలాంటి ప్రకటనలు చేయాలంటే మీ పదవికి రాజీనామా చేసి మాట్లాడండి. టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి వివరణలు ఇవ్వడం మానుకోండి. ఇందాపూర్కు హెరిటేజ్కు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. ఇవిగో అచ్చెన్నాయుడు ఆధారాలు చూపిస్తున్నా..
..మీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది. మేం చెప్పేది వాస్తవమో అవాస్తవమో హెరిటేజ్ వెబ్సైట్లో చూడమని ప్రజలను కోరుతున్నా. హెరిటేజ్ నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదు. కేరళ ప్రభుత్వం హెరిటేజ్ను బ్యాన్ చేయడమేనా అవార్డు. హర్యానా ప్రభుత్వం లక్ష రూపాయలు ఫైన్ వేయడమేనా రివార్డ్. ఇలాంటి సంస్థకు నేను క్షమాపణ చెప్పాలనడం సిగ్గుచేటు. శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ జరగాలి.. అదే సమయంలో ఇందాపూర్, తిరుపతి లడ్డూపై చర్చ చేయాలి. నేను కాదు క్షమాపణ చెప్పాల్సింది
..దేవదేవుడి పై నిందలు వేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముందు మీరు చేసిన పనికి తప్పు మాట్లాడామని లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పండి. నేను చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. నేను చంద్రబాబు లాగా అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తిని కాదు. మేం దేవదేవుడి పవిత్రత గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు ధనదాహం గురించి మాట్లాడుతున్నారు. నేను వ్యాపారాలు, షేర్ మార్కెట్ గురించి మాట్లాడలేదు. కేవలం ఏడాది కాలంలో హెరిటేజ్ షేర్ వాల్యూ 300 నుంచి 700 కు ఎలా వెళ్లింది. షేర్ మార్కెట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. 2021లో ఈనాడు పత్రిక ఇలాంటి నోటీసు ఇచ్చింది. మూడేళ్లు కిందా మీద పడి నోటీసులు వెనక్కి తీసుకుంది ..మళ్లీ ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సంస్థ నోటీసులిచ్చింది. ఈనాడు నోటీసులకే దిక్కులేదు.. చంద్రబాబు ఈ నోటీసులు ఏంచేస్తాయి?
చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్
తిరుపతి లడ్డూ పై అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇందాపూర్తో హెరిటేజ్ సంబంధంపై సీబీఐ విచారణ జరిపించాలి. ఎస్ఐపీబీ ద్వారా హెరిటేజ్ సంస్థకు 295 కోట్ల రూపాయల రాయితీ ప్రకటించింది. 35 ఉద్యోగాల కోసం 300 కోట్ల రాయితీ ఇవ్వడమేంటి?. తక్షణమే హెరిటేజ్కు ఇచ్చిన రాయితీని కేంద్ర క్యాబినెట్ వెనక్కి తీసుకోవాలి
చర్చకు రమ్మంటే ప్రభుత్వం భయపడుతోంది: కల్పలతారెడ్డి
చర్చకు రమ్మంటే ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. ఇందాపూర్, తిరుపతి లడ్డూపై ఇవాళ కూడా వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. సభ బయట మంత్రులు చర్చకు సిద్ధమంటున్నారు. మేం కూడా చర్చకు రావాలనే కోరుతున్నాం. కానీ చర్చకు రావడం లేదని కల్పలతారెడ్డి అన్నారు.
‘‘చంద్రబాబు గుట్టు బయటపడటంతోనే చర్చకు రావడం లేదనిపిస్తోంది. లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చింది. ఇందాపూర్ డెయిరీతో సంబంధాలున్నాయని హెరిటేజ్ వెబ్సైట్లో క్లియర్గా ఉంది. హెరిటేజ్కు సంబంధం ఉంది.. కాబట్టే చంద్రబాబు ఇందాపూర్కు నెయ్యి టెండర్లు కట్టబెట్టారు. 300 రూపాయలకు క్వాలిటీ నెయ్యి వస్తుందా అని చంద్రబాబు, పవన్ ప్రశ్నించారు. 2014-19 మధ్య ఇందాపూర్ కల్తీ నెయ్యి సప్లై చేసినట్లు మీరు ఒప్పుకుంటున్నారా? మా డిమాండ్ ప్రకారం కచ్చితంగా సభలో ఇందాపూర్పై చర్చించాల్సిందే’’ అని కల్పలతారెడ్డి అన్నారు.


