సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికలకు ముందు బాండ్లు ఇచ్చి మరీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ప్రతీ మహిళలకు నెలకు 1500 ఏమైంది? అని ప్రశ్నించారు. అప్పులు తెచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది?. సూపర్ సిక్స్ సక్సెస్ అని ఎలా చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. పథకానికి అమ్మవారి పేరు పెట్టి మహిళల్ని మోసం చేసి ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను నెరవేర్చలేదు. సూపర్ సిక్స్ సూపర్ అని గోబెల్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. బాబు పాలనలో ప్రతీ అంశంలోనూ మోసమే కనిపిస్తుంది. మోసానికి ప్యాంట్, షర్టు వేస్తే అది చంద్రబాబు. బాధ్యత గల పదవిలో ఉండి బాబు అబద్ధాలు ఆడుతున్నారు. ప్రతీ దాంట్లో చంద్రబాబు మోసాలే కనిపిస్తున్నాయి. అప్పుల్లో చంద్రబాబుది ఆల్టైమ్ రికార్డు. కానీ, ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు లేవు.

ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్టుగా బాబు పాలన ఉంది. కోవిడ్ వంటి సంక్షోభం లోనూ మేము మేనిఫెస్టో అమలు చేశాం. మా మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబుకు మాత్రం మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం. ఎన్నికలకు ముందు బాండ్లు ఇచ్చి మరీ ప్రజలను మోసం చేశారు. అప్పులు తెచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది?. ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికీ నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే చేయలేదు. నెలకు 3000 చొప్పున ఏడాదికి 36000 ఇస్తామన్నారు. కానీ, మూడు బడ్జెట్లో పెట్టింది మాత్రం సున్నా. నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు బకాయి పడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం ఇదే తొలిసారి కాదు. ప్రతీ మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నాడు.. ఏమైంది? అని ప్రశ్నించారు. 18-60ఏళ్ల లోపు మహిళలు కోటి 80 లక్షల మంది ఉన్నారు. ఈ మూడేళ్లలో మహిళలకు 97వేల 200 కోట్లు బకాయి పడ్డారు. ఇప్పటి వరకు ప్రతీ మహిళకు రూ.54వేలు చంద్రబాబు బకాయి ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.


2014 కల్లా అప్పులు రూ.లక్షా 47వేల 717 కోట్లు. చంద్రబాబు దిగిపోయే నాటికి మూడు లక్షల 90వేల 247 కోట్లు. మేము ఐదేళ్లలో చేసిన అప్పులు మూడు లక్షల 31వేల 671 కోట్లు. కానీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు మూడు లక్షల 17వేల 448 కోట్లు. కూటమి అప్పులను చంద్రబాబు పారదర్శకంగా చూపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 35వేల కోట్లు బకాయిలున్నాయి. జీతాలు పెంచకుండా ఉద్యోగులతో గేమ్ ఆడుతున్నారు’ అంటూ విమర్శలు చేశారు.


