దుబాయ్‌ దాటని బంగారం.. | Gold Shipments Stranded in Dubai as Iran Conflict Grounds Flights | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ దాటని బంగారం..

Mar 4 2026 9:13 PM | Updated on Mar 4 2026 9:28 PM

Gold Shipments Stranded in Dubai as Iran Conflict Grounds Flights

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ బంగారం (Gold) వ్యాపారంపై పడుతోంది. బులియన్ హబ్‌గా పేరుగాంచిన దుబాయ్‌ (Dubai) నుంచి విమానాలను సామూహికంగా రద్దు చేయడంతో వ్యాపారులు బంగారం, వెండి రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక కేంద్రంగా నిలిచిన యూఏఈ (United Arab Emirates) ఆసియా దేశాలకు బులియన్‌ను శుద్ధి చేసి ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్‌, లండన్‌ నుంచి రవాణా అయ్యే బంగారం కూడా దుబాయ్ మార్గం ద్వారానే ఆసియాకు చేరుతుంది. అయితే ఇరాన్‌ (#Iranwar) చేపట్టిన క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేయగా, దుబాయ్ విమానాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల విమానాల కార్గో హోల్డ్‌లలో తరలించే బంగారం, వెండి రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

దుబాయ్‌కు, వివిధ దేశాలకు మధ్య లోహ రవాణాను నిరవధికంగా నిలిపివేసినట్లు పలువురు వాణిజ్య, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. తుది గమ్యస్థానాలకు చేరాల్సిన సరుకులను ఇతర మార్గాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధిక విలువ గల బులియన్‌ను రోడ్డు మార్గంలో ఇతర విమానాశ్రయాలకు తరలించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ట్రేడింగ్ హబ్‌ల మధ్య బంగారాన్ని ప్రయాణికుల విమానాల ద్వారా తరలిస్తారు. ఇందుకు ఒక్క ట్రిప్‌కు ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఒక విమానంలో తీసుకెళ్లగల బంగారం పరిమాణానికి బరువుతో కాకుండా విలువ ఆధారంగా పరిమితి ఉంటుంది. బీమా సంస్థలు కూడా ఒక విమానంలో తరలించే కొన్ని టన్నుల విలువైన లోహానికే అండర్‌రైటింగ్ చేస్తాయి.

ఈ అంతరాయం తాత్కాలికమే అవుతుందని భావిస్తున్నప్పటికీ, యూఏఈ నుంచి విమానాల నిలిపివేత కొనసాగితే భారత్‌ సహా ఇతర ప్రధాన మార్కెట్లలో సరఫరా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాలో బులియన్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం సరఫరాపై ఆందోళనలను ప్రతిబింబిస్తోందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమాన్ తెలిపారు.

విమాన ట్రాకింగ్ వేదిక ఫ్లైట్రేడర్‌24 సమాచారం ప్రకారం.. ఇరాన్ తొలి ప్రతీకార దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 12,300కిపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్‌లైన్‌గా పేరొందిన ఎమిరేట్స్‌  బుధవారం రాత్రి వరకు దుబాయ్ నుంచి విమానాలను నిలిపివేయగా, ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌ గురువారం వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు బంగారం వ్యాపారులను కష్టాల్లోకి నెట్టాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రయాణ ఆంక్షల కారణంగా లండన్‌, న్యూయార్క్‌ నగరాల మధ్య బంగారం రవాణా దెబ్బతింది. ఆ సమయంలో జేపీమోర్గాన్‌ ఛేస్‌ వంటి బ్యాంకులకు అపూర్వమైన మధ్యవర్తిత్వ అవకాశాలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement