వాషింగ్టన్: యుద్ధ క్షేత్రంలో కనిపించే క్షిపణుల హోరు, పేలుళ్లు, ప్రాణనష్టం.. ఇవి అమెరికాకు వినోదాన్ని పంచే ఆటల్లా ఉన్నాయి. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యను ఒక అద్భుతమైన ‘వీడియో గేమ్’లా చిత్రికరిస్తూ సోషల్ మీడియాలో అమెరికా ప్రచార పర్వాన్ని మొదలుపెట్టింది. స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్, ఐరన్ మ్యాన్ వంటి పాప్ కల్చర్ పాత్రలు, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి వీడియో గేమ్ క్లిప్పింగులతో వైట్ హౌస్ విడుదల చేస్తున్న వీడియోలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. యుద్ధాన్ని వినోదంగా మార్చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరాన్పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా పెంటగాన్, వైట్ హౌస్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఈ వింత పోకడలు కనిపిస్తున్నాయి. ఎక్స్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా విడుదలవుతున్న ఈ వీడియోల్లో అమెరికా యుద్ధ విమానాలు లక్ష్యాలపై విరుచుకుపడుతుంటే, వెనుక నేపథ్య సంగీతం యాక్షన్ సినిమా ట్రైలర్ను తలపిస్తోంది. ముఖ్యంగా ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ స్టైల్లో క్షిపణులు తగిలిన వెంటనే స్క్రీన్పై ‘కిల్ స్కోర్’ గ్రాఫిక్స్ కనిపిస్తుండటం గమనార్హం. ఈ వీడియోలకు ఇప్పటికే 5.8 కోట్లకు పైగా వ్యూస్ దక్కాయి.
కేవలం గేమింగ్ మాత్రమే కాదు, చిన్న పిల్లలు ఇష్టపడే స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ వంటి కార్టూన్ పాత్రలను కూడా అమెరికా తన ప్రచారానికి వాడుకుంటోంది. ఒక క్షిపణి దాడి తర్వాత మరో దాడి చేసే ముందు ‘నేను మళ్ళీ చేయడం చూడాలనుకుంటున్నారా?’ అంటూ వచ్చే డైలాగులను జోడించడంపై అందరూ మండిపడుతున్నారు. టాప్ గన్, గ్లాడియేటర్ వంటి హాలీవుడ్ చిత్రాల క్లిప్పింగులతో యుద్ధ విమానాలను పోలుస్తూ అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించుకుంటోంది.
Damn teryata sudah di ramalkan 😂🤣🤣 pic.twitter.com/SEzrodEo9z
— Kageyoru (@Kageyoru_) March 8, 2026
‘యుద్ధం వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం ఇది. గతంలో యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుందో ప్రజలకు వివరించేవారు. కానీ ఇప్పుడు విధ్వంసాన్ని వినోదంలా చూపిస్తున్నారు’ అని మాజీ అండర్ సెక్రటరీ జేమ్స్ గ్లాస్మాన్ విమర్శించారు. యువతను, ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకోవడానికే ట్రంప్ ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విమర్శలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. అమెరికా సైనిక సాంకేతికత ఎంత శక్తివంతమైనదో, ఇరాన్ క్షిపణి కేంద్రాలను ఎంత సమర్థంగా ధ్వంసం చేస్తున్నామో ప్రజలకు ‘రియల్ టైమ్’లో చూపించడమే తమ ఉద్దేశమని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: చిరుత దవడలు సాగదీసి.. పంజాను తొక్కిపెట్టి..


