త్రీఫేజ్ విద్యుత్ అందేనా?
● ఏళ్ల తరబడి గిరిజన రైతుల నిరీక్షణ
● జిల్లాలో 321 కనెక్షన్ల కోసం దరఖాస్తులు
● ఐటీడీఏలో 17 డీడీలు మాయం
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని పలువురు గిరిజన రైతులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలోని గిరిజన గ్రామాల నుంచి 321 మంది రైతులు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయినా అధికారులు మూడేళ్లుగా ఒక కనెక్షన్కు కూడా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదు. ప్రతీసారి గిరిజన దర్బార్లో పలుమార్లు గిరిజనులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాపై అధికారులకు వినతులు ఇస్తూ పోతున్నారు. కానీ పట్టించుకునే వారే కరువయ్యారని బాధితులు వాపోతున్నారు. దీంతో విసిగివేజారిన గిరిజనులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా రాదని వ్యవసాయాన్ని మానివేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది.
రైతులు డీడీలు తీసినా..
ఏటూరునాగారం మండలంలోని అల్లంవారిఘణపురం, బన్నాజీబంధంకు చెందిన 17 మంది రైతులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు ఒక్కో రైతు రూ.5,500ల చొప్పున డీడీలు తీసి ఇచ్చారు. కానీ ఇంత వరకు విద్యుత్ సరఫరా చేయడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు లేవు, లైన్ లేదు, డీడీలు కూడా మాయమైన పరిస్థితి ఉంది. అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఐటీడీఏలో ఉండాల్సి న డీడీలు కనిపించకుండా పోయాయని రైతులు వా పోతున్నారు. సిబ్బంది మాయం చేశారా లేక వాటి ని డ్రా చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
డీడీలు ఇచ్చి మూడేళ్లు..
అల్లంవారిఘణపురంలో 12 మంది రైతులు, బన్నాజీబంధంకు చెందిన ఐదుగురు రైతులు ఒక్కొక్కరూ రూ.5,500ల చొప్పున డీడీలు తీశారు. మూడేళ్లు అయినా విద్యుత్ సరఫరా చేయడం లేదు. విద్యుత్శాఖ, ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం మూలంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదు. వ్యవసాయ బోర్లు వేసుకొని నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని ఏజెన్సీలోని రైతులు కోరుతున్నారు.
త్రీఫేజ్ విద్యుత్ అందేనా?


