విజ్ఞానాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి
ములుగు: శాస్త, సాంకేతిక విజ్ఞానాభివృద్ధిలో పరిశోధనలను ఆసరాగా చేసుకుని నేటి విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను డీఈఓ ప్రారంభించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు గందె రమేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి డీఈఓ సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ప్రతిరోజూ నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అందులోని విషయాలను విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలని సూచించారు. నిత్యజీవితంలో పరిశోధనాత్మ దృక్పథాన్ని అలవర్చుకుని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదుగాలన్నారు. పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిట్లను పరిశీలించిన ఆయన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి కృషి చేసిన సైన్స్ ఉపాధ్యాయులు సతీశ్ కుమార్, క్యాతం రాజేందర్ లను ఆయన అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకంగా తయారుచేసిన ఎగ్జిబిట్లు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. వీటిని స్ఫూర్తిగా తీసుకొని సైన్స్ పట్ల అభిరుచిని పెంచుకొని సైన్స్ కోర్సులు చదివి విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోవాలని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ లో ప్రదర్శింపబడుతున్న మోడల్ రాకెట్ లాంచింగ్ కార్యక్రమానికి విద్యార్థులను తీసుకెళ్తున్న ఉపాధ్యాయ బృందాన్ని డీఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిట్టల మల్లయ్య, తోట చంద్రమౌళి, మహమ్మద్ జాఫర్ అలీ, కేశబోయిన మదన్ మోహన్, గైని సతీష్, వజ్జ లక్ష్మినారాయణ, దొంతి సత్యం, చల్లా భాస్కర్ రెడ్డి, బైకాని రజిత, విద్యార్థులు పాల్గొన్నారు.
విజ్ఞానాభివృద్ధిలో భాగస్వాములు కావాలి


