ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి
● టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన
కార్యదర్శులు ఉప్పస్వామి, నాగరాజు
ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి, పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం మండల కేంద్రంలోని ఐటీడీఏ ఏపీఓ వసంతరావుకు ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం చెల్లించాలన్నారు. వీటితో పాటు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలను 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయాలన్నారు. జీవో నంబర్ 317 ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. వసతి గృహాలకు వసతి ప్రత్యేకంగా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్లను మంజూరు చేయాలని కోరారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల సమస్యల పరిష్కారానికి 10వ తేదీన హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు బడుగు రాజు, భూక్య సారంగపాణి పాల్గొన్నారు.


