గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గండు కుమార్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్ల డించారు. అర్హులైన విద్యార్థులు గడువు లోపు తమ దరఖాస్తులను సమార్పించాలని కోరారు. వివరాలకు ఫోన్ నంబర్లో 8096350115 సంప్రదించాలని సూచించారు.
సీతారాముల తలంబ్రాలు ఊరేగింపు
వాజేడు: మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామంలో సీతారాముల తలంబ్రాలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. త్వరలో జరుగనున్న సీతారాముల కల్యాణానికి చేతులతో ఒలిచి తలంబ్రాలను సిద్ధం చేశారు. ఆ తలంబ్రాలను సోమవారం ఊరేగించారు.
రామప్పలో ఫారెస్ట్ అధికారులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం అటవీశాఖ ఎంఓఈఎఫ్సీసీ ఐజీఎఫ్ డాక్టర్ త్రినాధ్ కుమార్, సీపీఎఫ్ ప్రభాకర్ సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు వారికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించగా రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. వారి వెంట ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, భూపాలపల్లి డీఎఫ్ఓ నవీన్ రెడ్డి, ఎఫ్డీఓ సత్యయ్య, ఎఫ్బీవో కిషన్ తదితరులు ఉన్నారు.
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. గడిచిన నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 4.21 లక్షల టన్నులు కాగా, 3.45 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 82 శాతంలో నిలిచినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 12,327 టన్నులు నమోదైందన్నారు. ఓపెన్కాస్టుల్లో మట్టి వెలికితీత పనుల్లో ఓసీ–2లో 13.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 10.14 లక్షల క్యూబిక్ మీటర్లు 75శాతం సాధించగా, ఓసీ–3లో 30.00 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 23.45 లక్షల క్యూబిక్ మీటర్లు 78శాతం సాధించినట్లు తెలిపారు. మొత్తంగా 43.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 33.59 లక్షల క్యూబిక్ మీటర్లు 77శాతం మట్టి వెలికితీత పనులు చేయడం జరిగిందన్నారు. ఈ నెల ఉత్పత్తి లక్ష్యం 4.54 లక్షల టన్నులు చేయాల్సి ఉందన్నారు. ఉత్పత్తి పెంపు కోసం ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని, పనిగంటలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించి ఉత్పత్తి పెంపునకు అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా వర్కింగ్ పర్మిషన్ తదితర నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తి కొనసాగించాలని తెలిపారు. రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని తెలిపారు.


