భూపాలపల్లి: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో అంబేడ్కర్ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్య చైతన్యం, ఐక్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అనంతరం ఎస్పీ సంకీర్త్, అదనపు ఎస్పీ నరేష్కుమార్ ఫ్రెండ్లీ వాలీబాల్ మ్యాచ్ ఆడారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాల యువతతో 13 జట్లను తీసుకొని వారికి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐ డి.నరేష్కుమార్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


