వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
కన్నాయిగూడెం: మండలంలోని కన్నాయిగూడెం, ఏటూరు సబ్స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుందని విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటూరునాగారం నుంచి ఉన్న 33కేవీ లైన్లో తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగింపుతో పాటు మండల పరిధిలోని విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
పనులు త్వరగా
పూర్తి చేయండి
వాజేడు: జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పుర్తి చేయాలని నేషనల్ హైవే ఈఈ మనోహర్ అన్నారు. వాజేడు మండలంలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు వరకు 10 కిలో మీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. శుక్రవారం వాజేడుకు వచ్చిన ఆయన రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. మండల పరిధిలోని చీకుపల్లి, పెద్ద గొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగుపై పాత బ్రిడ్జిని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇప్పటికే డైవెర్షన్ రహదారి వేసి బ్రిడ్జి తొలగింపు పనులను చేపట్టారు. ఈ పనులను పరిశీలించిన ఈఈ మనోహర్ వర్షాకాలం రాక ముందే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట నేషనల్ హైవే ఏఈ రామ్ముర్తి తదితరులు ఉన్నారు.
ములుగు: ములుగు మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి సీతక్క ప్రత్యేక నిధులు కేటాయించారని, కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు అవగాహన లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు మన్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క సహకారంతో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే రూ.15 కోట్ల పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. అప్పటివరకు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగలేదని, కాబట్టి అప్పటి టెండర్ల ప్రక్రియపై ఇటీవల ఎన్నికై న కౌన్సిలర్లు అనవసర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో ప్రారంభమైన టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్లు వేయాలని కలెక్టర్ను కోరడం వారి అవివేకాన్ని సూచిస్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పనులకు వచ్చిన నిధులు అదే పరిధిలో వినియోగించబడతాయని, అనవసర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు.


