మంగపేట: మండలంలోని లక్ష్మినర్సాపురంలో కొలువుదీరిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ, పగిడిద్దరాజు కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ఈనెల 3 నుంచి ప్రారంభమైన జాతర మూడవరోజు కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి నాగులమ్మ, వనదేవతకు ఎదుర్కోలు మహోత్సవం అనంతరం ఆలయ ప్రధాన పూజారి (నాగులమ్మ ఉపాసకుడు) బాడిష రామకృష్ణ స్వామి ఆధ్వర్యంలో రాత్రి ఒంటి గంట నుంచి వేద పండితులు గాదె నరేష్ ఆచార్యులు, మహేష్, రాకేష్ల బృందం నాగులమ్మ అమ్మవారు, పగిడిద్దరాజు కల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. నాగులమ్మ ఉపాసకుడు (దేవరబాల) రామకృష్ణ స్వామి లోకకల్యాణం కోసం సుమారు రెండున్నర గంటల పాటు అగ్నిగుండంలో నడిచారు. భక్తులు జై నాగులమ్మ తల్లీ అంటూ భక్తితో చేసిన నినాదాలు జాతర ప్రాంతం మార్మోగింది. అంతకుముందు రామకృష్ణ స్వామి ఆదివాసీ గిరిజన పూజారులు, వడ్డెలతో కలిసి రహస్యపూజలు నిర్వహించి అగ్నిగండాన్ని వెలిగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు నాగులమ్మ, సడాలమ్మ, వనదేవత వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఏటూరునాగారం, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, చర్ల, మణుగూరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు.


