మారేడుగొండ చెరువులోకి దేవాదుల జలాలు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని మారేడు గొండ చెరువులోకి ఆదివారం దేవాదుల లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. లక్ష్మీదేవిపేట, బూర్గుపేట, నర్సింగాపూర్, లక్ష్మిపురం, చక్రవర్తిపల్లి గ్రామాలకు చెందిన రైతులు మారేడు గొండ చెరువు కింద రబీలో వరి పంట సాగు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలకు సరస్సు కట్ట తెగిపోగా ఇటీవల మరమ్మతులు చేపట్టారు. చెరువులో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో రైతులు, నాయకులు సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడిన మంత్రి దేవాదుల పైపులైన్ ద్వారా మారేడుగొండ చెరువులోకి నీటిని విడుదల చేయాలని ఆదేశించడంతో అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో రబీ వరి పంట సాగుకు నీటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకుంటామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.


