ములుగు రూరల్: యాసంగి పంటలకు దేవాదుల నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్కు నీరు చేరుకుంందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తెలిపారు. యాసంగికి నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, మల్లంపల్లి సర్పంచ్ ల్యాదె శ్యాంరావు, రాజు, రాకేష్ పాల్గొన్నారు.
గిరిజన కళాశాలలో అధికారుల విచారణ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 10 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు మహబూబాబాద్, ములుగు జిల్లాల గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డిలు గురువారం గురుకుల కళాశాలను సందర్శించి విచారణ చేపట్టారు. కలుషితమైన ఆహారం తినడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారా అన్న కోణంలో ఆరా తీశారు. అదేవిధంగా పరీక్షల సమయం కావడంతో ఒత్తిడికిలోనై ఉంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల ఒత్తిడికి గురయ్యారని, ఎండ తీవ్రతతో అలా జరిగిందని విద్యార్థులు తెలిపినట్లు ఆర్సీఓ వెల్లడించారు. ఆహారంలో ఎలాంటి లోపాలు, కల్తీ జరగలేదన్నారు. ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని వివరించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
వెంకటాపురం(కె): డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్భట్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరీవ్–ఆలీవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో, కారు డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రజలను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో ఆస్పత్రికి చేర్చడం గోల్డెన్ ఆవర్గా పరిగణిస్తారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గుడ్ సమారిటన్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన వ్యక్తికి రూ.25 వేలు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. అనంతరం విలేకరులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ముత్యం రమేశ్, ఎస్సై తిరుపతిరావు, వాజేడు ఎస్సై సతీశ్, పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సెకండ్ ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో గొంది హనుమంత్ గోల్డ్ మెడల్ సాధించగా ఏఎస్పీ అభినందించారు.
సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలోని పలు పరీక్ష కేంద్రాలను హ్యూమనిటీస్ భవనం, మైక్రోబయాలజీ, జియాలజీ, కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ కళాశాలలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి సందర్శంచి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించిన వారిలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు.


