ఏటూరునాగారం: రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికల కార్యాచరణ అమలుపై బుధవారం రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిదు దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అన్నారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లాస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భద్రతా చర్యలు, వివిధ వర్గాల వారి సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


