ఎస్ఎస్తాడ్వాయి: కొత్తగా పోడుభూమిని సాగుచేయలేదు.. పాత భూములనే సాగు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు కందకాలు తీయడం నిలిపివేయాలని కాల్వపల్లికి చెందిన రైతులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం బాధిత రైతులు విలేకర్లతో మాట్లాడారు. కాల్వపల్లిలో 40 ఆదివాసీ కుటుంబాలకు చెందిన తాము ముప్పై ఏళ్లుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. 2001లో పోడు చేసి 2004 నుంచి సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నామని వివరించారు. ఇన్నేళ్లుగా ఎన్నాడూ జేసీబీలతో రాని అధికారులు ఆకస్మాత్తుగా కందకాలు తీయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో మంత్రి సీతక్క కూడా పట్టాలిప్పిస్తామని చెప్పారని, కొత్తగా పోడు చేయొద్దని చెప్పిన మాటను గౌరవించి పోడు చేయలేదని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క స్పందించి తమకు పట్టాలు ఇప్పించాలని వేడుకున్నారు.


