తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ పాలిటిక్స్లో ఇప్పుడు ‘దళపతి’ విజయ్ రూపంలో ఒక పెను తుపాను ముంచుకొస్తోంది. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘పారావీల్’ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకులనే కాదు, అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లోనూ రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) రాష్ట్రంలో మూడో ప్రధాన శక్తిగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
నిర్ణయాత్మక శక్తిగా 13.6 శాతం ఓట్లు
పారావీల్ సీఈఓ కిరణ్ కొండేటి విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. విజయ్ పార్టీ ఏకంగా 13.6 శాతం ఓట్ల వాటాను కొల్లగొట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో సుమారు 70.2 లక్షల మంది ఓటర్ల నాడిని సంగ్రహించిన ఈ సర్వేలో తమిళనాట ముక్కోణపు పోటీ అనివార్యమని స్పష్టం అయ్యింది. అధికార డీఎంకే 41.5 శాతం, ఏఐఏడీఎంకే 36.2 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ, టీవీకే సాధిస్తున్న ఈ ఓట్ల శాతం షాకిచ్చేలా ఉంది. ఈ సర్వే ప్రకారం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటును శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి విజయ్ చేరుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నవతరం ఓటర్లంతా..
ఈ సర్వేలో వెల్లడైన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. యువత, తొలిసారి ఓటు వేస్తున్న నవతరం ఓటర్లంతా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. కేవలం సినిమా అభిమానులే కాకుండా, సాంప్రదాయ రాజకీయాలపై విరక్తి చెందిన విద్యావంతులు, మార్పును కోరుకుంటున్న యువత టీవీకేను తమ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని తేలింది. ముఖ్యంగా చెన్నై లాంటి పట్టణ ప్రాంతాల్లో విజయ్ మేనియా ఏ స్థాయిలో ఉందంటే, కొన్ని సెగ్మెంట్లలో ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీని వెనక్కి నెట్టి టీవీకే రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయమని తెలుస్తోంది.
పక్కా వ్యూహం.. క్షేత్రస్థాయి విశ్లేషణ
కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో కుల సమీకరణలు, ప్రాంతీయ సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకతను లోతుగా విశ్లేషించారు. దీనిలో దక్షిణాది జిల్లాల నుంచి పశ్చిమ తమిళనాడు వరకు విజయ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తేలింది. సినిమా గ్లామర్ను పొలిటికల్ పవర్గా మార్చడంలో టీవీకే కేడర్ సక్సెస్ అవుతోందని ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు మారుతుండటం, స్వింగ్ నియోజకవర్గాల్లో టీవీకే పుంజుకోవడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
వార్ రూమ్ టెక్నాలజీతో..
ఎన్నికల కురుక్షేత్రంలో విజయ్ సరికొత్త సాంకేతికతను జోడించబోతున్నారు. పారావీల్ సంస్థ పరిచయం చేస్తున్న ‘వన్ క్యాండిడేట్ - వన్ వార్ రూమ్’ కాన్సెప్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతి అభ్యర్థికి క్షేత్రస్థాయి డేటా విశ్లేషణను అందిస్తూ, గెలుపు గుర్రాలను సిద్ధం చేసే ఈ వ్యూహం పాత తరం రాజకీయ నాయకులకు సవాల్ విసురుతోంది. సంప్రదాయ ప్రచార శైలిని పక్కన పెట్టి, డేటా ఆధారిత వ్యూహాలతో విజయ్ అడుగులు వేస్తుండటం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలిచింది.
ద్రవిడ గడ్డపై సరికొత్త చరిత్ర?
కరుణానిధి, జయలలిత తదితర రాజకీయ దిగ్గజాల నిష్క్రమణ తర్వాత తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసే సత్తా విజయ్లో ఉందని ఈ సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయి. 13.6 శాతం ఓట్ల వాటా అంటే అది కేవలం సంఖ్య కాదు, తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయగల ఒక బలమైన శక్తి అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ద్రవిడ కోటలో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు


