ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..! | Naganadi River: 40,000 women stepped forward and changed the story | Sakshi
Sakshi News home page

ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!

Mar 9 2026 2:26 PM | Updated on Mar 9 2026 4:41 PM

Naganadi River: 40,000 women stepped forward and changed the story

తమిళనాడులో కాలానుగుణ నది నాగనది. గత 20 ఏళ్లుగా ఎండిపోయి నిర్జీవంగా మారిపోయింది. చక్కగా నీటితో కళకళలాడే నది కాస్తా..బీడు వారిపోయింది. ఈ నదే అక్కడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు ఆధారం. అలాంటి నదికి నారీ శక్తి ప్రాణం పోసి 365 రోజులు నీటితో పారేలా చేస్తోంది. అదెలా ఈ మహిళామణులకు సాధ్యమైందో తెలుసుకుందామా..!.

సరిగ్గా ఆ టైంలోనే  గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికతతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ దేశవ్యాప్తంగా నదీ పరీవాహక ప్రాంతాలను పునరుద్ధరించడానికి నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో నీటి కొరత నిర్వహణలో భాగంగా నాగనది నది పునరుజ్జీవన పనిని అమలు చేసే నిమిత్తం 2014లో వెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను సర్వే చేసేందుకు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్వచ్ఛంద సేవకులతో సహా సాంకేతిక నిపుణుల బృందం కదిలివచ్చింది. 

ఈ నదిని తిరిగి పునరుజ్జీవింప చేయాలంటే బావులు, బండరాళ్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించాలన్సి అవసరం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఎండిపోయిన నదులను పునరుద్ధరించేందుకు దాదాపు 20 వేల మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఈ వార్త దావానలం ఆ చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద స్వచ్ఛంద సేవకులుగా ఈ పనుల్ల పాలుపంచుకునేవాళ్ల సంఖ్య అనుహ్యంగా 40 వేలకు పైగా చేరింది. వారంతా మహిళామణులే కావడం విశేషం. 

ఈ మహిళా స్వచ్ఛంద సేవకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మార్గదర్శకత్వంలో బావులు తవ్వడం, సిమెంట్ రింగులు నిర్మించడం వంటి వాటితో అవిశ్రాంతంగా పనిచేశారు. ఫలితంగా భూగర్భజల మట్టాలు ఒక మీటర్‌ నుంచి ఎనిమిది మీటర్లకు పెరిగాయి. దెబ్బతో నదికి తిరిగి జీవం వచ్చినట్లైంది. ఇదంతా కేవలం మహిళా శ్రామిక శక్తి వల్ల సాధ్యం కావడం విశేషం. ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన వందవ 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో చెప్పి..ఆ నారీ శక్తి జట్టు కృషిని ప్రశంసించారు. 

ఒకరకంగా సమాజం కోసం అందరూ నడుబిగించాలని చెప్పడమే కాదు..ఐక్యతను సైతం చాటి చెప్పింది ఈ నారీ శక్తి. మహిళ తలుచుకుంటే భూమిని స్యశ్యామలంగా ఉంచగలరు. అలాగే ప్రకృతి సైతం పులకరించిపోయేలా అందంగా అపురూపంగా మార్చగలరు. అలాంటి మహిళామణులకు, మహిళా శక్తికి సదా జోహార్లు అని కీర్తిద్దాం, గౌరవిద్దాం. కేవలం విమెన్‌ డే ఒక​ రోజున మాత్రమే కాదు..ప్రతి సందర్భంలోనూ అవకాశంలోనూ మహిళలను పురుషులతో సమానంగా చూస్తే చాలు. అంతకుమించి ఇంకేమి ఆశించరు అని గుర్తిస్తే చాలు కదూ..!.

 

(చదవండి: చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..! టెక్‌ ఉద్యోగం వద్దనడానికి కారణం అదే..)

 

Advertisement
 
Advertisement
Advertisement