ముందుచూపేది?
వచ్చే ఏడాది జూన్ 23 నుంచి గోదావరి పుష్కరాలు
రూ.4కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
రామన్నగూడెం వద్ద చుక్క నీరు లేకుండా ఉన్న పుష్కరఘాట్
రాంనగర్ వద్ద ఒడ్డుకు దగ్గరలో ఉన్న గోదావరి నీరు
ఏటూరునాగారం: వచ్చే ఏడాది జూన్ 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులు పుణ్యస్నానాలు చేసే విధంగా ఘాట్ల నిర్మాణంతో పాటు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి అవసరం ఉంది. 2015లో చోటుచేసుకున్న తప్పిదాలు పునరావృతం కాకుండా ఇప్పటికై నా ముందుచూపుతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఏజెన్సీలోని వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ప్రవహిస్తోంది. 2027 జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో 2015లో వచ్చిన గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం విడుదల చేసిన రూ. 6 కోట్ల నిధులతో ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట, రామన్నగూడెం వద్ద పుష్కరఘాట్లను ఇరిగేషన్ అధికారులు నిర్మించారు. అలాగే మంగపేట మండల కేంద్రంలో మరో ఘాట్ నిర్మించారు. అధికారులు ఎస్టిమేట్ వేసి నిర్మించిన ఘాట్ల వద్ద గోదావరి ప్రవాహం లేక పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో జల్లుస్నానాలు చేశారు. గోదావరి పుష్కరాలకు పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చి జల్లు స్నానాలు చేసిన భక్తులు బీఆర్ఎస్ మంత్రులు, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక రైతులు, వ్యవసాయ దారులు ట్రాక్టర్ల ద్వారా కిలో మీటర్ దూరంలో ప్రవహించే గోదావరికి భక్తులను తరలించి పుణ్యస్నానాలు చేసేలా సహకరించారు. గోదావరి ఒడ్డున ఇన్ఫిల్టర్ బావులు నిర్మించి మోటార్ల ద్వారా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేసినా కొంతమంది ట్రాక్టర్లలో గోదావరికి వెళ్లి స్నానాలు చేశారు.
ఈ ప్రాంతాల్లో ఘాట్లు నిర్మిస్తే ఉపయోగం
ఇటీవల కలెక్టర్ టీఎస్.దివాకరతో పాటు అధికారులు జిల్లాలోని పుష్కరఘాట్ల నిర్మాణాలకు స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కానీ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం చేపట్టాలనే ఆలోచన చేయలేదని స్థానికుల ద్వారా తెలుస్తుంది. వాజేడు మండలం పూసూరు రేవు, ఎడ్జర్లపల్లి రేవు వద్ద నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఘాట్లను నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ముళ్లకట్టకు కిలోమీటర్న్నర దూరంలో మరో ఘాట్, రాంనగర్ వద్ద పాత పడవ రేవు వైపునకు నిర్మిస్తే భక్తులకు ఇబ్బంది ఉండదు. మంగపేట వద్ద ఇప్పుడున్న దానికి ఆనుకుని మరో ఘాట్ నిర్మిస్తే భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు సులువుగా ఉంటుంది.
2015 నాటి పాఠాలు నేర్వని అధికారులు
నీరులేక జల్లు స్నానాలు చేసిన భక్తులు
2027 పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విన్నపం
నీరు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఘాట్లు నిర్మించాలని వేడుకోలు
వచ్చే ఏడాదిలో జరగబోయే పుష్కరాలకు భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు రూ.4 కోట్లతో 50మీటర్ల పుష్కరఘాట్ కాంక్రీట్తో నిర్మించేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతి పాదనలు సిద్ధం చేసింది. గోదావరి వరద ఘా ట్కు దూరంగా ఉంటే పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమా దం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గోదా వరి ప్రవహించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఘాట్లను నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు అధికారులు, నాయకులను కోరుతున్నారు.
ముందుచూపేది?


