‘ఆంగ్లంపై పట్టు సాధించేలా బోధించాలి’
వాజేడు: ఆంగ్ల భాషపై విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధించాలని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ సాంబయ్య, ఉల్లాస్ కోఆర్డినేటర్ కృష్ణ బాబులు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వాజేడు, నాగారం ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాన్ని సోమవారం ఎంఈఓ తేజావత్ వెంకటేశ్వరరావు, హెచ్ఎం ఆనందరావులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఫౌండేషన్ లిటరసి. న్యూమరసి వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు జయేందర్, సయ్యద్ అలీముద్దీన్ ఖాద్రీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్
సరఫరాకు చర్యలు
ములుగు రూరల్: వేసవిలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం 33కు పెంచినట్లు తెలిపారు. అదనంగా 49 నూతన ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసినట్లు వివరించారు. గతేడాది మార్చిలో 5, 816 మెగావాట్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 5,904 మెగావాట్లకు చేరిందని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 7 నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశామని వివరించారు. విద్యుత్ నాణ్యత మెరుగుపరిచేందుకు 27.35 కేఎం, 33/11 కేవీ ఇంటర్ లింక్ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందిస్తామని తెలిపారు.
శంకుస్థాపన సరే..
పనులేవి?
చిట్యాల: చిట్యాల, టేకుమట్ల మండలాల ప్రధాన రహదారిపై మూడు చోట్ల కల్వర్టుల నిర్మాణాలకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. చిట్యాల మండలంలోని నవాబుపేట, సీఆర్పల్లి శివారులోని ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం కోసం ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిసెంబరు 2024లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి 14 నెలలు పూర్తయినా సంబంధిత కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేదు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాంతినగర్ సమీపంలో కల్వర్టు పక్కన తాత్కాలిక రోడ్డు కోసం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. ప్రతీ ఏడాది వర్షాకాలంలో గుట్టల ప్రాంతం నుంచి వర్షపునీరు వస్తుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కల్వర్టుల నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయించాలని కోరుతున్నారు.
108 ఉద్యోగులకు
స్టార్ అవార్డులు
హన్మకొండ అర్బన్/ఎంజీఎం: ఆపద సమయంలో 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మెరుగైన వైద్య సేవలందించి ప్రాణాలు కాపాడిన హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు 108 సిబ్బందికి 108 సర్వీస్ వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టార్ అవార్డులు అందించారు. ఐనవోలుకు చెందిన ఈఎంటీ ఏనుగుల రాజు, పరకాల టీం సభ్యులు పాముల రాజు, పుట్ట విజయభాస్కర్, ధర్మసాగర్ మండలానికి చెందిన మాచర్ల వెంకటేశ్, వరంగల్ జిల్లాకు చెందిన ఈఎంటీలు కె.నాగరాజు, శ్యాంసుందర్, పైలట్ వై.రాజన్న, కుమారస్వామి అవార్డులు అందుకున్నారు. వీరిని 108 సర్వీస్ అధికారులు, సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో వరంగల్ మేనేజర్ భరత్ కుమార్, భూపాలపల్లి మేనేజర్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


