కన్నాయిగూడెం: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని నీతిఆయోగ్ కన్సల్టెంట్ అధికారి కృష్ణన్గోపాల్ తెలిపారు. మండలంలో నీతిఆయోగ్ సంపూర్ణ అభియాన్ 2.0 ఆస్పీరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రాజన్నపేట, దేవాదుల గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ఆస్పీరేషనల్ బ్లాక్లో చేపట్టిన ఆరు ఇండికేటర్లను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నిరుపేదల అభ్యున్నతికి అధికారులు అహర్నిశలు పాటుపడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల నుంచి ఆరేళ్ల పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా పెరుగుతారని వివరించారు. అనంతరం ముప్పనపల్లిలోని అంగన్వాడీ కేంద్రాలతో పాటు కేజీబీవీలోని మరుగుదొడ్లు, తాగునీరు, విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాలు, వివిధ వసతులను పరిశీలించారు. అలాగే కంటైనర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధతి తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రేమలత, తహసీల్దార్ సర్వర్ పాషా, మండల అభివృద్ధి అధికారి సాజిదా బేగం, ఎంఈఓ సాంబశివరావు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
నీతిఆయోగ్ కన్సల్టెంట్ అధికారి
కృష్ణన్గోపాల్


