వాజేడు: మండల పరిధిలోని రాంపురం గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ డీఈ పురుషోత్తం ఆధ్వర్యంలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈ పురుషోత్తం మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా రాంపురం గ్రామానికి 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి దర్తీ అభియాన్ యోజన కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మీటర్లు లేని వారికి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రత్యేక లైన్ వేసి ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన వెంట ఏడీఈ ఉమారావు, ఏఈ హర్షద్ అహ్మద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ ఉపాధ్యాయుడు
కృష్ణబాబుకు గౌరవ డాక్టరేట్
వాజేడు: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పీర్ల కృష్ణబాబు గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్ని విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని సాధించారు. విధుల్లో అంకితభావంతో పనిచేస్తూనే పేదలకు సాయం చేయాలనే సంకల్పంతో అమ్మ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ క్రమంలో ఎంతోమందికి సాయం అందిస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో సైతం పేదలకు నిత్యావసర సరుకులు అందచేసి శభాష్ అనిపించుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ను బుధవారం ప్రదానం చేసింది. ఈ మేరకు కృష్ణబాబు మంత్రి సీతక్కను కలవగా శాలువా కప్పి సన్మానించారు.
కార్మికుల సమస్యలపై
ఆరోపణలు సరికాదు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పసునూటి రాజేందర్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాయలంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేని వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొంతకాలంగా కార్మికుల సమస్యలను పరిష్కరించామని, కార్మిక సంక్షేమానికి యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరిపి పలు ప్రయోజనాలను సాధించామని తెలిపారు. కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు చేయకుండా కార్మిక సంక్షేమానికి కలిసి పని చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు మధుకర్రెడ్డి, జోగు బుచ్చయ్య, శశరత్నం, సమ్మిరెడ్డి, అశోక్, హుస్సెన్, శంకర్, రమేష్లు పాల్గోన్నారు.


