● ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్
ఏటూరునాగారం: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రహమాన్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం బైక్ ర్యాలీ చేపట్టారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ అడవులను సంరక్షించడంతో పాటు వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. ప్రకృతి ప్రసాధించిన ఔషధ మొక్కలు మానవాళికి అమూల్యమైనవన్నారు. వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల వేట, చెట్ల నరికివేత వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు అటవీశాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.


