ఏటూరునాగారం: పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆదివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏటూరునాగారంలో ర్యాలీ నిర్వహించి వై జంక్షన్లో రాస్తారోకో చేశారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న యుద్ధంతో చమురు నిల్వల కొరత ఉంటుందనే సాకుతో గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వగురువు అని చెప్పుకునే నరేంద్ర మోదీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని దుయ్యబట్టారు. అమెరికా చెప్పుచేతల్లో మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్కు పెంచిన రూ.60లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.దావూద్, తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, వాసు, చిట్టిబాబు, రఘుపతి, జిల్లా కమిటీ సభ్యులు మల్లారెడ్డి, ప్రవీణ్, తోకల రవి, రమేష్, దేవయ్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవికుమార్
ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన ర్యాలీ


