ములుగు: వేసవి కాలంలో సంభవించే అగ్ని ప్రమాదాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని లీడింగ్ ఫైర్ ఫైటర్ బి.సుధాకర్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని బిట్స్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో దీపం వెలిగించడం, వంట చేసేటప్పుడు గ్యాస్ వినియోగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నారులు నిప్పు జోలికి వెళ్లొద్దని సూచించారు. వేసవిలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏ చిన్న పొరపాటు జరిగినా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. చల్లని వాతావరణంలోనే నిప్పు వెలిగించాలని, ఎండతీవ్రతను బట్టి పూరిళ్లపై నీళ్లు చల్లుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి.కవిత, టెక్నికల్ ఫైర్ ఫైటర్ ప్రవీణ్, అనిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
లీడింగ్ ఫైర్ ఫైటర్ సుధాకర్ రెడ్డి


