ఏటూరునాగారం/మంగపేట: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగపేట మండల పరిధిలోని చుంచుపల్లి, పొదుమూరు, ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, ముళ్లకట్ట ప్రాంతాల్లోని పుష్కరఘాట్లను ఏఎస్పీ మనన్భట్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు సూరి, మహేశ్లతో కలిసి ట్రాఫిక్ రూట్లు, పార్కింగ్ స్థలాలు, వన్వే ప్రాంతాలను గురువారం పరిశీలించారు. స్నాన ఘట్టాల ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుష్కరఘాట్లకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని పుష్కరాలను విజయవంతం చేస్తామన్నారు. గోదావరిలో వరద నీరు, ఉధృతి, అందులోని గోతులు, ప్రమాద ఘటికలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు, నది వద్ద భద్రతా చర్యలు, భక్తుల రద్దీ నియంత్రణ వంటి అంశాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతీ ఘాట్ వద్ద గజ ఈతగాళ్లు, పడవలు, రెస్క్యూ టీం, మర బోట్లు, రబ్బర్ ట్యూబ్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


