ములుగు రూరల్: రేపు(శుక్రవారం) జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ సంపత్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం డిగ్రీ కళాశాలలో జాబ్మేళా కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు నిర్వహించే జాబ్మేళాకు జిల్లా వాసులే కాకుండా భూపాలపల్లి, నర్సంపేట, పరకాల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వివరించారు. గూగుల్ ఫామ్ ద్వారా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బాలయ్య, కవిత, అనిల్ కుమార్, ఉదయశ్రీ, విజేత, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


