మంగపేట: మండలంలోని లక్ష్మీనర్సాపురం నాగులమ్మ ఆలయంలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన నాగులమ్మ ఆదివాసీ గిరిజన జాతర శనివారంతో ముగిసింది. విశేష పూజలు అందుకున్న నాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తమైంది. చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని ఆలయ ట్రస్టి, ప్రధాన పూజారి(నాగులమ్మ ఉపాసకుడు) బాడిష రామకృష్ణ స్వామి ఆధ్వర్యంలో పూజారులు, వడ్డెలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలు బాగుండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ పూజారులు, వడ్డెలు తల్లులకు పూజలు నిర్వహించి వేడుకున్నారు. అనంతరం పూజారులు ఝెర్రట్టలగుట్టకు సడాలమ్మను, నాగులమ్మను గండొర్రెగుట్టకు డోలు వాయిద్యాల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో వన ప్రవేశానికి సాగనంపారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టి బాడిష రామకృష్ణస్వామి మాట్లాడుతూ నాగులమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని తెలిపారు. మహాజాతర విజయవంతానికి కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాని, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, ముయబోయిన శివ, కుల పెద్ధలు తదితరులు పాల్గొన్నారు.


