16 మీటర్ల పొడవుతో డ్యామ్
నీటిని ఒడిసిపట్టేందుకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద డ్యామ్ల కేటాయింపు
ఏటూరునాగారం: వర్షాలు, వరదల సమయంలో నీరు వృథాగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఆ నీటిని ఒడిసిపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఒక్కో గ్రామానికి రెండు చెక్ డ్యామ్లను నిర్మించాలని రూపకల్పన చేశాయి. నీటి సంరక్షణ పథకం కింద ఒక్కో చెక్ డ్యామ్కు రూ.5లక్షల బడ్జెట్ను సైతం అధికారులు కేటాయించారు. జిల్లాలో అత్యధికంగా నీటి వనరులు ఉన్నా విద్యుత్ మోటార్లు, బోర్ల మీద ఆధారపడి రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీలోని చెరువులు, వాగులు, వంకలు, తోగులు ఇలా నీటి సౌకర్యం, సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో చెక్డ్యామ్లు నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్కు అందాయి. ఈ మేరకు కలెక్టర్ దివాకర మండలాల్లోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు గ్రామ పంచాయతీకి రెండు చొప్పున సులభతరమైన, పూర్తి స్థాయిలో ఉపయోగించే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశాలు అందాయి. దీంతో ఈజీఎస్ అధికారులు గ్రామాల్లోని రైతులు, స్థానికులతో చర్చించి వాగులు, వంకలు, తోగులు, చెరువు సమీపంలో నిర్మాణాలకు ప్రణాళికలను సిద్ధం చేశారు.
పెరగనున్న భూగర్భ జలాలు
నీటిని చెక్డ్యామ్లు నిర్మించి నిల్వచేస్తే భూగర్భజలాలు కూడా అధికంగా పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో మిర్చి, వరి, పత్తి, ఇతర పంటలకు కావాల్సినంత నీటిని ఈ చెక్డ్యామ్ల్లో నిల్వచేసి పంటల అవసరాలకు అనుగుణంగా నీటిని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు వ్యవసాయదారులకు విద్యుత్ ఖర్చులు, మోటార్లు, బోర్లు వేయడం లాంటి ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో 348 చెక్డ్యామ్లు
జిల్లా వ్యాప్తంగా 348 చెక్డ్యామ్లు నిర్మించే అవకాశాలున్నాయి. వీటికి తోడు ఇంకా రైతులకు అవసరమైన చోట మరిన్ని అదనంగా నిర్మించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలో నీటి సౌకర్యం ఎక్కువగా ఉన్న ఏజెన్సీ మండలాల్లో మరిన్ని అదనంగా చెక్డ్యామ్లు మంజూరయ్యే అవకాశాలు ఉండడంతో రైతులకు మరింత లాభం చేకూరనుంది.
నీటి సంరక్షణలో సర్పంచ్ల పాత్ర కీలకంగా మారింది. గ్రామంలోని సర్పంచ్, గ్రామం పేరు, హబిటేషన్, లోకేషన్, సర్వే నంబర్, ప్రభుత్వం, ఫారెస్టు, రెవెన్యూ, ప్రైవేటు అనే వివరాలు అందించాల్సి ఉంది. జీపీకి రెండు చొప్పున తీసుకోవచ్చు. లేదంటే ఎక్కువగా కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. పంచాయతీ కార్యదర్శులు కూడా గ్రామంలో ఎక్కడి చెక్డ్యామ్లు అక్కడే నిర్మించాలని నిర్ణయించి గ్రామ పంచాయతీల తీర్మాణం ఈజీఎస్ అధికారులకు అందించాలి.
– చరణ్రాజ్, ఏపీఓ
ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఏటూరునాగారం
16 మీటర్ల పొడువుతో ఒక్కో చెక్డ్యామ్ను నిర్మించేందుకు రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో నిబంధనల ప్రకారం నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు అధికంగా ఉన్నప్పటికీ నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీటిని నిల్వచేసే ప్రాంత్రాలను గుర్తించి చెక్డ్యామ్లు నిర్మిస్తే రైతులకు 365ల రోజుల పాటు రెండు పంటలు సులభంగా పండుతాయి. ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
గ్రామానికి రెండు చొప్పున మంజూరు
ఒక్కోదానికి రూ.5 లక్షల బడ్జెట్


