ఎస్ఎస్ తాడ్వాయి: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్కుమార్ తెలిపారు. మండల పరిధిలోని మేడారంలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా మైపతి అరుణ్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితాలో ఉంచడం ద్వారా ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఇప్పటికే దేశవ్యాప్తంగా లంబాడీలను ఎస్టీ జాబితాలోనే కొనసాగించేలా రాజకీయ కుట్రలు చేస్తుందని తెలిపారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో ఆదివాసీలు ఐక్యతతో ఉద్యమించాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర కమిటీలను ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఈసం సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా పోడెం బాబు, కల్తీ వీరస్వామి, కార్యదర్శులుగా చంద రఘుపతిరావు, సోయం రాజేందర్, కొడెం వెంకటేశ్వర్లులను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మైపతి అరుణ్కుమార్, ప్రధాన కార్యదర్శులుగా గుర్రాల రవీందర్, కుడిమెత తిరుపతి, ఉపాధ్యక్షులుగా పొదెం రామ్మూర్తి, సోయం జంగు, అలెం కోటి, కొడప నగేశ్, ఉయిక సుదర్శన, పడిగ నాగేశ్వర్రావు, కార్యదర్శులుగా దారబోయిన రమేశ్, సోయం విక్రమ్ తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం వారు సమ్మక్క– సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు
మైపతి అరుణ్కుమార్


