ములుగు: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ను కిశోరబాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 నుంచి 15 ఏళ్ల బాలికలు తమ పేర్లను పోర్టల్లో నమోదు చేసుకున్న అనంతరం వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల అనుమతి మేరకే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం లాగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం మండల కేంద్రాలలోని ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేస్తారని వివరించారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్లు కిశోరబాలికల పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


