మొక్కజొన్న, మిర్చి పంటల పరిశీలన
ములుగు రూరల్: మండల పరిధిలోని అబ్బాపూర్, అన్నంపల్లి గ్రామాల్లోని మొక్కజొన్న, మిర్చి తోటలను గురువారం వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణ్ కుమార్, వీరన్న, మానస సౌందర్య, మాధవిలు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో యాసంగి వరి పంటలకు కాండం తొలిచే పురుగు, జింక్ లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కాండం తొలిచే పురుగు నివారణకు నాటు పెట్టిన 15–20 రోజుల్లోపు కార్బోప్యూరన్ 3జీ ఎకరాకు 10 కిలోలు,, కార్టాప్ హ్రెడ్రోక్లోరిక్ 4జీ ఎకరాకు 8 కిలోలతో పాటు అదనంగా లింగాకర్షణ బుట్టలు వాడాలని సూచించారు. చౌడు సమస్య ఉన్న భూముల్లో రెండో దఫా యూరియాతో పాటు 100 గ్రాముల కార్బెండాజిం, మాంకోజెబ్ మిశ్రమాన్ని చల్లి పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. అధిక మోతాదులో యూరియా వాడటం నీరు నిల్వ ఉండటం వల్ల వేరు కుళ్లు, కింద ఆకులు ఎండిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. వాటి నివారణకు 10 కిలోల యూరియా 150 గ్రాముల స్పింట్ కలిపి చల్లాలని సూచించారు. జింక్ లోపం నివారణకు లీటర్ నీటిలో 2 గ్రాముల జింక్ కలిపి చల్లాలని సూచించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు క్లోరాన్ ట్రానిప్రోల్, లాంబ్డా సైహలోత్రిన్ మందు లీటర్ నీటికి 0.5 మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పరమేశ్, ఏఈవో జ్యోతి, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.


