ములుగు: విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు కావొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీబాలికల ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమంపై ఒకరోజు జిల్లాస్థాయి వర్క్ షాప్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా డీఈఓ సిద్ధార్థ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతీ పాఠశాలలో ప్రహరీ క్లబ్బులు నిర్వహించాలన్నారు. ప్రహారీ క్లబ్ అధ్యక్షుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సభ్యులుగా ఒక సీనియర్ టీచర్, 6 నుంచి 9 తరగతి వరకు ప్రతి తరగతి నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు ఉండి ప్రహరీ క్లబ్బులను పటిష్టంగా నిర్వహించాలన్నారు. అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్స్పెక్టర్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను తెలుసుకొని, ఎవరైనా మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నట్లు గమనిస్తే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యాంసుందర్ రెడ్డి, ఎస్సైలు ఉపేందర్, శ్రీనివాస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలకు సిద్ధం కండి..
వాజేడు: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితారాణా అన్నారు. సోమవారం డిజిటల్ ప్యానెల్ స్క్రీన్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖాధికారులు అవగాహన కల్పించారు. వాజేడు ఉన్నత పాఠశాలలో విద్యార్ధులతో కలిసి ఎంఈఓ తేజావత్ వెంకటేశ్వరరావు వీక్షించారు. పరీక్షలను ప్రశాంతంగా రాసి ఎక్కువ మార్కులు వచ్చేలా చూసుకోవాలని అవగాహన కల్పించారు.


