చట్టాలపై అవగాహన ఉండాలి
● చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్
ములుగు రూరల్: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. ఈ మేరకు శనివారం బండారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు, బాల కార్మిక, ర్యాగింగ్, బాల్య వివాహాలు, మోటర్ వెహికిల్ చట్టాల గురించి వివరించారు. న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, ప్రధానోపాధ్యాయుడు నర్సింహమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


